Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం రూటు మార్చింది. ఒకప్పుడు తిరుమలకు వెళ్లడం కష్టంగా కనిపించేది. ఇప్పుడు స్వామి దర్శనం మరింత తేలికైంది. తాజాగా భక్తులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి డాలర్లు ఆన్లైన్లో భక్తులు కొనుగోలు చేసే పద్దతి తీసుకురానుంది. దీనికి సంబంధించి తెరవెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి బంగారం, వెండి డాలర్లు కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఆ తరహా డాలర్లు కేవలం తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉండేవి. లేటెస్ట్ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్లైన్లో అందించేందుకు రెడీ అవుతోంది. దీనిల్ల టీటీడీకి ఆదాయం కూడా పెరగనుంది. దీనిపై ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు శ్రీవారి డాలర్ల విక్రయాలను మరింత పెంచాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది.
తిరుమలలో కౌంటర్లో శ్రీవారి డాలర్లు విక్రయిస్తారు. ఇకపై బంగారం, వెండి పెండెంట్లు, డాలర్లతోపాటు బంగారు, వెండి నాణేలను ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించింది. భక్తులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన తర్వాత పోస్టల్ ద్వారా పంపించాలని ప్రణాళికలు వేసింది. డాలర్లకు సంబంధించి వ్యవహారం కావడంతో భద్రతకు ప్రాధాన్యమిస్తూ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఆలోచన చేస్తోందట.
ఈ డాలర్లను ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్లలో మార్పులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరిగాయి. చివరకు సామాన్యులు అటువైపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వెండి డాలర్లకు బంగారం పూత పూసి విక్రయించాలని డిసైడ్ అయ్యింది.
కమిటీ సూచనలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది టీటీడీ పాలకమండలి. త్వరలో తిరుమల శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. కొనుగోలు తర్వాత వారిచ్చిన అడ్రస్కు పంపనుంది.