Revanth Kodangal:తెలంగాణలో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా తన సొంత గడ్డ కొడంగల్ నియోజకవర్గంలో మెరుపు పర్యటనకి రెడీ అయ్యారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో పర్యటన ఉండనుందని తెలుస్తుంది.
ముఖ్యంగా సొంత నియోజకవర్గంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో పర్యటన అభివృద్ధి పనులు మరింత జోరు అందుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొండగల్ ప్రజానీకం.
సరిగ్గా 2 గంటలకు మద్దూరు
షెడ్యూల్ ప్రకారం ముందుగా, రేపు మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు మద్దూరు ప్రాంతానికి సీఎం రేవంత్ చేరుకోనున్నారు. అక్కడున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించడంతో పాటు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను స్వయంగా తనిఖీ చేయనున్నారు. నిర్మాణంలో ఏ చిన్న లోపం ఉన్నా సహించేది లేదని ఇప్పటికే చెప్పారు కూడా. ఈ సందర్భంగా అక్కడి నాణ్యతా ప్రమాణాలను దగ్గరుండి పరిశీలించనున్నారని తెలుస్తుంది.
మధ్యాహ్నం 3.20 గంటలకు గోకఫసల్వాడ్
ఇక ఆ తర్వాత వెంటనే, అంటే మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్మిస్తున్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ పై అధికారులను అడిగి తెలుసుకుంటారు.
4.00 గంటల సమయానికి దౌల్తాబాద్
ఇక సాయంత్రం 4.00 గంటల సమయానికి దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి సీఎం రేవంత్ చేరుకుంటారు.అక్కడ కళాశాల భవన పనులు ఎంతవరకు వచ్చాయో లైవ్ లో చెక్ చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు హకీంపేటలోని ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ హబ్ పనుల వద్దకు చేరుకుంటారు. ఈ ఎడ్యుకేషన్ హబ్ కొడంగల్ ప్రాంతానికే మకుటం లాంటిదని, దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు.
ఇక హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పరిశీలన పూర్తయిన వెంటనే, సీఎం అక్కడి నుంచే అధికారులతో గ్రాండ్ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రకరకాల అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షిస్తారు.
ALSO READ:ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?
ఈసారి ఇంకెన్ని వరాలు కురిపిస్తారో !
ఇక సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం, రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన కొడంగల్లోని తన సొంత నివాసానికి బయలుదేరుతారు. రేపు రాత్రికి ఆయన కొడంగల్లోని తన ఇంట్లోనే బస చేస్తారు. చాలా రోజుల తర్వాత సీఎం తన సొంత ఇంట బస చేస్తుండటంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కూడా.చూడాలి మరి సొంత గడ్డపై అడుగుపెట్టబోతున్న సీఎం ఈసారి ఇంకెన్ని వరాలు కురిపిస్తారో !