TTD Booking: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. స్వామివారి దర్శన టికెట్లు, వసతి గదుల కోసం కేవలం అధికారిక మార్గాలనే నమ్ముకోవాలని, మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
అధికారిక వెబ్సైట్నే వాడండి
శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదులు, ఆర్జిత సేవలు వంటి ఏ బుకింగ్స్ అయినా సరే.. భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, అనధికారిక వెబ్సైట్లను అస్సలు నమ్మకూడదు. భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఈవో సూచించారు.
సమాచారం కోసం వీటిని ఫాలో అవ్వండి
దర్శన టికెట్ల విడుదల, రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ సేవల సమాచారం, భక్తులు వేచి ఉండే సమయం వంటి అన్ని అధికారిక వివరాలను టీటీడీ తన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. వీటితో పాటు భక్తులకు సరైన సమాచారాన్ని చేరవేసేందుకు ఎస్వీబీసీ ఛానల్ కూడా నిరంతరం అందుబాటులో ఉంటుంది.
Also Read: ఆయన చర్మం మందం.. దున్నపోతుపై వాన పడ్డట్లే.. చంద్రబాబుపై జగన్ ఫైర్!
సందేహాలు ఉంటే కాల్ చేయండి
టికెట్లు లేదా దర్శనాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా.. భక్తులు నేరుగా టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257 ను సంప్రదించవచ్చు. అక్కడ మీకు అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత లభిస్తుంది. అంతే తప్ప, దర్శనాల పేరుతో సంప్రదించే ఏ మధ్యవర్తికీ లేదా అనధికారిక వ్యక్తులకు ఆన్లైన్లో గానీ, చేతికి గానీ డబ్బులు బదిలీ చేయవద్దు.
మోసగాళ్లపై ఇక్కడ ఫిర్యాదు చేయండి
ఒకవేళ ఎవరైనా దళారులు లేదా అపరిచిత వ్యక్తులు టికెట్లు ఇప్పిస్తామని మిమ్మల్ని సంప్రదిస్తే.. వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నంబర్ 9866898630 కు సమాచారం అందించాలి. అలాంటి వారిపై టీటీడీ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. శ్రీవారి సేవలో పారదర్శకతకు, భక్తుల భద్రతకు టీటీడీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భక్తులు కూడా సహకరించి అధికారిక మార్గాల ద్వారానే సేవలు పొందాలని అదనపు ఈవో కోరారు.