YS Jagan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. భీమవరంలోని లూధరన్ హైస్కూల్ హెలిప్యాడ్కు చేరుకున్న ఆయనకు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి గరగపర్రు రోడ్డులో ఏర్పాటు చేసిన ‘ఆక్వా రైతు బహిరంగ సభ’ ప్రాంగణానికి భారీ ర్యాలీగా చేరుకున్న జగన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సిండికేట్ గుప్పిట్లో ఆక్వా రంగం
రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలన్నీ ఆయన సానుభూతిపరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని ఆరోపించారు. వీరంతా ఒక సిండికేట్గా ఏర్పడి ధరలను నియంత్రిస్తూ రైతులను దోచుకుంటున్నారని, నాలుగు నెలల్లోనే కేజీ ఫీడ్ ధరను రూ.14 నుండి రూ.16 వరకు పెంచేశారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
ఆక్వా ధరలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబడుతూ, ‘దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలించదో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంతే’ అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జోన్లతో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్, కోల్డ్ స్టోరేజ్ లు, ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు జీఓ నెం. Rt 169 తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కరెంట్ కట్ చేసి జనరేటర్లతో సాగు చేయమంటున్నారని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారని దుయ్యబట్టారు.
Also Read: మాదాపూర్ పరువు హత్య.. ఉప్పరపల్లిలో హైటెన్షన్.. నిందితుడి ఇంటిపై దాడి!
వైసీపీ హయాంలో జరిగిన మేలు
గత వైసీపీ ప్రభుత్వంలో తాము తీసుకొచ్చిన ‘అప్సుడా’ చట్టం ద్వారా కంపెనీలు ధరలు పెంచకుండా కట్టడి చేశామని, రొయ్యల కౌంట్ 100కు రూ.230 తగ్గకూడదనే నిబంధన పెట్టామని గుర్తుచేశారు. నాడు 57 నెలల కాలంలో రూ.3,300 కోట్లు సబ్సిడీ ఇచ్చి, యూనిట్ రూపాయి యాభై పైసలకే విద్యుత్ అందించామన్నారు. తమ హయాంలో క్వాలిటీ కోసం ల్యాబ్లు పెట్టి, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించడం వల్లే ఏపీకి ‘బెస్ట్ మెరైన్ స్టేట్’ అవార్డు వచ్చిందని చెప్పారు.
రైతులకు భరోసా.. ఉద్యమానికి సై
ప్రస్తుత ప్రభుత్వం నరసాపురం ఆక్వా యూనివర్సిటీని, మెడికల్ కాలేజీని నిలిపివేసిందని జగన్ ఆరోపించారు. కేవలం ఆక్వా రైతులే కాకుండా, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆక్వా రైతులకు నేనున్నాను’ అని భరోసా ఇస్తూ, రైతుల సమస్యలపై అవసరమైతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరో మూడేళ్లలో మళ్లీ రైతు ప్రభుత్వం వస్తుందని, అప్సుడాకు పూర్వవైభవం తెచ్చి సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో నరికేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.