Bonalu Festival: స్వేచ్చ బ్యూరో: భాగ్యనగరం ఆషాడ శోభను సంతరించుకుంది. గల్లీ గల్లీలో పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలు, ఘటాల ఊరేగింపులు, డప్పు చప్పుళ్లతో నగరం మార్మోగిపోయేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చారిత్రక ఆషాడ బోనాల ఉత్సవాలకు లష్కర్ నుంచి భాగ్యనగరం వరకు సర్వజన హృదయాలు పరవశించిపోనున్నాయి. ఈ నెల 16న(గురువారం) చారిత్రక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబికా దేవి ఆలయంలో జరిగే తొలి పూజతో ఈ ఏడాది బోనాల జాతర వైభవంగా ప్రారంభం కానుంది.
బోనాల ఉత్సవాల ఆనవాయితీ ప్రకారం తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబికా దేవి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ లనె 16న జరగనున్న ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వంగ సుందరంగా గోల్కొండ కోటను తీర్చిదిద్దారు. బోనాల జాతర ప్రారంభం కానుంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలను ఆగస్టు 2వ తేదీన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పాల్గొననున్నారు. ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం, ఆ తర్వాత అంబారీ ఊరేగింపు జరగనుంది.
Also read: ఉక్కపోతకు గుడ్ బై.. దూసుకొస్తున్న భారీ వర్షాలు.. ఐఎండీ చల్లని కబురు!
బోనాల ఉత్సవాల్లో భక్తులను ఎంతగానో ఆకట్టుకునే ప్రధాన ఘట్టం అమ్మవారి అంబారీ ఊరేగింపు. బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగుపై అంబారీ ఊరేగింపు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయస్సు ఉన్న లక్ష్మీ అనే అంబారీని తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇక్కడి నుంచి అంబారీని తీసుకువచ్చారు. ఆగస్టు 3న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జీ మండి, ఆగస్టు 10న హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపులు జరగనున్నాయి.ఈ ఏనుగుపై అమ్మవారిని అలంకరించి అంబారీ ఊరేగింపును నయనమనోహరంగా సాగించనున్నారు.
తెలంగాణ పండుగను విశ్వవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈసారి బోనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20కోట్లను కేటాయించింది. దేవాదాయ, మున్సిపల్ (జీహెచ్ఎంసీ), జలమండలి, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన బడ్జెట్ లో పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 3427 దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలు కేటాయించగా, మిగిలినవి బోనాల జాతర ప్రమోషన్ కోసం వినియోగించనున్నారు. భక్తులకు క్యూ లైన్లు, మంచినీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాల్లో లోటు రాకుండా చర్యలు చేపట్టారు.
దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు 29 ప్రధాన ఆలయాల్లో మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈనెల 16న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాల సమర్పిస్తారు. ఈనెల 21న బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం తరఫున పట్టు వస్త్రాల సమర్పిస్తారు.
Also read: బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి
అదే విధంగా కట్ట మైసమ్మ ఆలయం(చిలకలగూడ)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహంకాళి ఆలయం(ఉప్పుగూడ)లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అక్కన్న మాదన్న ఆలయం(హరిబౌలి)లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముత్యాలమ్మ ఆలయం(భేలా)లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సింహవాహిని మహంకాళి ఆలయం(లాల్దర్వాజా)లో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, మహంకాళి ఆలయం(మిరాలం మండి)లో స్పీకర్ గడ్డం ప్రసాద్, మహంకాళి ఆలయం(గౌలిపుర) మంత్రి వాకిటి శ్రీహరి, నల్ల పోచమ్మ ఆలయం(మురాద్ మహల్)లో మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండా ప్రకాష్, జగదాంబ ఆలయం(సుల్తాన్ షాహి) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బంగారు మైసమ్మ ఆలయం, నల్ల పోచమ్మ ఆలయం(హరిబౌలి)లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బంగారు మైసమ్మ ఆలయం(రాంబక్ష్బండ)లో మంత్రి జూపల్లి కృష్ణారావు, బంగారు మైసమ్మ ఆలయం(సుల్తాన్ షాహి)లో పాల్గోననున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్ల పోచమ్మ ఆలయం(సీబీఐ క్వార్టర్స్)లో ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, దర్బార్ మైసమ్మ ఆలయం(అలియాబాద్)లో డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామ్ చంద్ర నాయక్, బంగారు మైసమ్మ ఆలయం(బోయిగూడ)లో ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, మహంకాళి ఆలయం(అలీజా కోట్ల)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహంకాళి ఆలయం(అంబర్పేట్)లో మంత్రి దనసరి అనసూయ (సీతక్క), దర్బార్ మైసమ్మ ఆలయం(కార్వాన్)లో దామోదర రాజనరసింహ, భూలక్ష్మి ఆలయం(ముస్లింజంగ్ బ్రిడ్జ్ ), భాగ్యలక్ష్మి ఆలయం(చార్మినార్)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్ల పోచమ్మ ఆలయం,(సబ్జీ మండి)లోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహంకాళి ఆలయం(నటరాజ్ నగర్)లో మంత్రిదామోదర రాజనరసింహ, ఖిల్లా మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ నగర్ (ఎల్బీ నగర్) లో మంత్రిఅనసూయ (సీతక్క), మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం, నాచారంలో మంత్రిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహంకాళి ఆలయం, గౌలిగూడ లో డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామ్ చంద్ర నాయక్ పాల్గొననున్నారు.
నగరవాసులతో పాటు పొరుగు జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రేపటి నుంచి భాగ్యనగర వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో పులకించనున్నాయి. కళాకారుల ప్రదర్శనలు, ఆలయాల ముఖద్వారాల అలంకరణలతో భాగ్యనగరం ముస్తాబైంది. రేపటి నుంచి నగరం మొత్తం ‘అమ్మో.. తల్లి..’ అనే నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది.
Also read: హైదరాబాద్–తిరుపతి విమానాలకు ఫుల్ డిమాండ్.. చుక్కల్లోకి టికెట్ ధరలు!