Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన ఒక దారుణ పరువు హత్య ఈ గ్రామంలో చిచ్చు రేపింది. ప్రేమ వ్యవహారం, కుల వివక్ష, విడాకుల గొడవలు చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలిగొనగా.. ఆ కక్షలు ఇప్పుడు గ్రామానికి పాకాయి. బాధితుడి బంధువులు ఆగ్రహంతో నిందితుడి ఇంటిపై దాడికి దిగడంతో ఉప్పరపల్లిలో భయానక వాతావరణం నెలకొంది.
ప్రేమ నుంచి పెళ్లి వరకు..
పోలీసులు సమాచారం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్, అదే గ్రామానికి చెందిన నికిత అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, భాస్కర్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నికిత తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులం అడ్డు రావడంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు.
విడాకులు.. పెరిగిన కక్ష
పెళ్లయినప్పటికీ నికిత తరచూ భాస్కర్తో మాట్లాడుతూనే ఉండేది. ఈ విషయం నికిత భర్తకు తెలియడంతో వారి కాపురం రోడ్డున పడింది. భార్యాభర్తల మధ్య రోజురోజుకూ విభేదాలు ఎక్కువవడంతో, చివరకు తట్టుకోలేక భర్త నికితకు విడాకులు ఇచ్చేశాడు.
ఈ పరిణామంతో నికిత తండ్రి రాజు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యాడు. తన కూతురి జీవితం ఇలా నాశనమవడానికి, సంసారం కూలిపోవడానికి భాస్కరే కారణమని భావించాడు. ఎలాగైనా అతడిపై పగ తీర్చుకోవాలని మనసులో కక్ష పెంచుకున్నాడు.
హాస్టల్కు వెళ్లి దారుణ హత్య
ప్రస్తుతం భాస్కర్ హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. భాస్కర్ ఎక్కడున్నాడో తెలుసుకున్న నికిత తండ్రి రాజు, మరి కొంత మందితో కలిసి అతడు ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లాడు. పక్కా ప్లాన్తో భాస్కర్పై ఒక్కసారిగా దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
ఉప్పరపల్లిలో మొదలైన నిప్పులు
హైదరాబాద్లో భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో నిందితుడు రాజు ఇంటి పైకి దూసుకెళ్లారు. రాజు ఇంటిపై రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్, ఇతర వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశారు. న్యాయం జరగాలంటూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు
గ్రామంలో పరిస్థితి చేజారిపోతోందని గమనించిన పోలీసులు వెంటనే ఉప్పరపల్లికి చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. నిందితుడి ఇంటి వద్ద పహారా ఏర్పాటు చేసి, గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఉంది.