YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో దేశంలోనే అతి పెద్ద స్కాం జరుగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ ప్రతులను గురువారం విజయవాడ లోక్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందించారు వైఎస్ జగన్. అనంతరం లోక్భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల స్కాంను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్ జగన్ తెలిపారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ వల్ల జరిగే నష్టాల్ని గవర్నర్కు వివరించామన్నారు. ప్రభుత్వం బాధ్యతగా లేకపోతే ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధీనంలో విద్య, వైద్య ఉండాలన్నారు. ఈ వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఇంకెందుకని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వం ఒక విజన్తో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు నిర్మించిందని వైఎస్ జగన్ తెలిపారు. అన్నీ సర్వీసులు ఉండేలా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామ్నారు. పేదలకు ఉచితంగా సూపర్, మల్టీ స్పెషాలిటీ సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటుచేశామన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తు్న్నారని మండిపడ్డారు.
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని జగన్ అన్నారు. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టడమే ఈ స్కామ్ అని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం అన్నారు. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ప్రైవేట్ వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదని వైఎస్ జగన్ అన్నారు.