Kalisetti Appalanaidu: వైఎస్ఆర్సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సేకరించిన సంతకాల కట్టలు, వాటిని గవర్నర్కు పంపించడం అంతా ఒక “సినిమా సెట్టింగ్”లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ సంతకాలు సేకరించి గవర్నర్కు పంపిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని, కానీ చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ఎంతో అభివృద్ధిని చేసి చూపిందని అన్నారు. ప్రజలు ఛీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా జగన్ ఇంకా పగటికలలు కంటున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లెలో కూడా సంతకాలు సేకరించామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని అప్పలనాయుడు హితవు పలికారు. ఎక్కడో కూర్చుని మాట్లాడటం కాదని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. గతంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా లక్ష పోస్ట్ కార్డులతో మద్దతు తెలిపారని, అది నిజమైన ప్రజాభిమానమని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు పాలనను, ఎన్డీయే కూటమిని కోరుకుంటున్నారని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్న చంద్రబాబు వైపు నేడు దేశం మొత్తం చూస్తోందని, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసించారని అప్పలనాయుడు పేర్కొన్నారు.