ఏపీలో ప్రస్తుతం బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం నిన్న ముగిసింది. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభంలో వైసీపీ నేతలు అంతరాయం కలిగించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. అంతేకాకుండా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఎవరైనా తమ డిమాండ్ల కోసం అసెంబ్లీలో ప్రశ్నించడం సరైనదే. కానీ, గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ గత రెండేండ్లుగా పోరాడుతోంది. అయితే,నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని అధికార కూటమి సర్కార్ చెబుతోంది. ఈ విషయం మాజీ సీఎం వైఎస్ జగన్కు కూడా తెలుసని చెబుతోంది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు వినిపించుకోవడం లేదు.
ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే అందులో 10 శాతం సీట్లు రావాలి. అనగా 175 సీట్లలో 10 శాతం అనగా.. 17.5 మొత్తంగా 18 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది.కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. ఇదే విషయాన్ని కూటమి సర్కార్ పదే పదే చెబుతోంది. అయినప్పటికీ వైసీపీ నేతలు వినిపించుకోవడం లేదు. ఏపీలో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారాన్ని షేర్ చేసుకుంటున్నాయి. మిగిలిన ఒకే ఒక్క పార్టీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నది. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై అధికార పార్టీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు.
2019లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లు సాధించారు. అప్పుడు టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి. జనసేనకు 1 స్థానం మాత్రమే వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు రావడంతో కనీస నిబంధన ప్రకారం 18 సీట్లు దాటాయి. అందుకే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అదే విధంగా ఇప్పుడు జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి. కానీ, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి.ఈ క్రమంలోనే ప్రభుత్వం వైసీపీకి డిమాండ్కు స్పందించడం లేదని తెలుస్తుండగా..వైసీపీ నేతలు మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నారు.ఈ క్రమంలోనే అసెంబ్లీసమావేశాలకు వారు అడ్డంకులు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.
BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ప్రస్తుతం ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నది. ఈసారి రూ.2 లక్షలకు పైగా బడ్జెట్ను కూటమి సర్కార్ ప్రతిపాదించింది. ఇందులో సగం వరకు ఉద్యోగుల వేతనాలు, సంక్షేమం, అప్పులు చెల్లించడానికే వెళ్తుండగా…మౌలికసదుపాయాలు, రాజధాని నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి పెద్దగా నిధులు సరిపోవడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా సీఎం చంద్రబాబు తమకు అధిక నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన బడ్జెట్ సెషన్స్కు ముందే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించినట్టు తెలుస్తోంది. ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని మరిచి వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించడంపై పలువురు విమర్శిస్తున్నారు.