Agriculture Technology: ఆధునిక కాలానికి అనుగుణంగా ఆదిలాబాద్ రైతులు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి.. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇక్కడి అన్నదాతలు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులు.. రైతులను వేధిస్తున్న తరుణంలో.. డ్రోన్ టెక్నాలజీ కర్షకులకు ఒక వరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాన్ని రైతులు విజయవంతం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త వ్యవసాయ విప్లవం మొదలైంది. ఇప్పటి వరకు డ్రోన్లను కేవలం పురుగుమందులు చల్లడానికే ఉపయోగించిన రైతులు..ఇప్పుడు విత్తనాలు వేయడానికి కూడా వాడుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో.. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్.. తన పొలంలో ఈ సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతు లక్ష్మణ్..దేశంలోనే తొలిసారిగా సాధారణ డ్రోన్లో కొన్ని సాంకేతిక మార్పులు చేసి నువ్వుల విత్తనాలను నాటారు. శాస్త్రీయ పద్ధతిలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుండి 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా డ్రోన్ను సిద్ధం చేశారు. సాధారణంగా ఒక ఎకరం పొలంలో విత్తనాలు వేయడానికి ఒక రోజంతా పట్టేది. కానీ ఈ డ్రోన్ టెక్నాలజీతో కేవలం అరగంటలోనే ఆ పని పూర్తయింది. దీని వల్ల సమయం ఆదా అవడమే కాకుండా.. కూలీల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిలిచింది.
Also Read:Niharika Konidela: పెళ్లి చేసుకోకపోవడానికి నేనేమైనా ముసలిదాన్నా.. రెండో పెళ్లి పై నిహారిక క్లారిటీ…
వ్యవసాయంలో కూలీల కొరత విపరీతంగా పెరుగుతున్న తరుణంలో… యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా డ్రోన్లను వినియోగిస్తే.. రైతులకు శ్రమ, పెట్టుబడి గణనీయంగా తగ్గుతాయి. విత్తనాలు సమానమైన దూరంలో పడటం వల్ల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అన్ని రకాల పంటలకు ఈ టెక్నాలజీని విస్తరించేందుకు రైతు లక్ష్మణ్ అడుగులు వేస్తున్నారు. మొదట్లో డ్రోన్తో విత్తనాలు పడతాయా అని అనుమానం ఉండేదని మరో రైతు అశోక్ తెలిపారు. కానీ శాస్త్రవేత్తల సలహాతో చేసిన ఈ ప్రయత్నం చాలా బాగా అనిపించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పడే కష్టం అరగంటలోనే అయిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గనుక ఇలాంటి డ్రోన్లపై సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే, తమలాంటి చిన్న రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. కూలీలు దొరకని సమయంలో ఈ టెక్నాలజీ తమకు పెద్ద దిక్కు అవుతుందంటున్నారు. ఎండ్ వాయిస్-మొత్తానికి ఆదిలాబాద్ గడ్డపై మొదలైన ఈ డ్రోన్ సాగు ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిస్తోంది. సాంకేతికత తోడుతో..ఇక వ్యవసాయం దండగ కాదు పండుగ అవుతుందంటున్నారు ఆదిలాబాద్ అన్నదాతలు.
Story By Apparao, Big Tv
Also Read: Niharika Konidela: క్యాస్టింగ్ కౌచ్ పై చిరు కామెంట్స్…నిహారిక రియాక్షన్ ఇదే