Pilot Rohit Reddy: కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో వెళ్ళిన పోలీసులకు అక్కడ విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్, నగదుతో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం సిట్ అధికారులు ఈ కేసులో పట్టుబడ్డ వారితో పాటు అనుమానితులను కూడా వరుసగా విచారిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి జరుగుతోంది? ఈ పార్టీల వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏమిటి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తొలుత నోటీసులు ఇచ్చి పంపించిన ఏడుగురిలో నలుగురిని ప్రస్తుతం సిట్ అధికారులు గంటల తరబడి విచారిస్తున్నారు. గత ఐదు రోజులుగా కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్ లు వరుసగా సిట్ ముందు హాజరవుతున్నారు. పార్టీలో పాల్గొన్న వారితో వీరికి ఉన్న పరిచయాలు.. గతంలో కూడా ఇలాంటి పార్టీలు జరిగాయా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ప్రియాంకా రెడ్డిని వరుసగా రెండు రోజుల పాటు విచారించారు. పార్టీ జరిగిన రోజు ఆమె బ్యాగులో పోలీసులు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు ఎక్కడి నుండి వచ్చింది? ఆమె సొంత సొమ్మా లేక డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించినదా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మల పాత్రపై సిట్ దృష్టి సారించింది. వీరి ముగ్గురిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కస్టడీ పిటిషన్పై రేపు కోర్టు తీర్పు వెలువరించనుంది. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే.. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు (Action Plan) సిద్ధం చేసుకుంది. వీరి విచారణతో డ్రగ్స్ నెట్వర్క్ అసలు గుట్టు వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫామ్హౌస్ పార్టీల్లో పాల్గొన్న వారి జాబితాను పోలీసులు సేకరిస్తున్నారు. పార్టీల నిర్వహణకు అయ్యే ఖర్చులు.. డ్రగ్స్ కొనుగోలుకు జరిగిన నగదు బదిలీలపై నిఘా ఉంచారు.గతంలో జరిగిన పార్టీల డేటాను, మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా విశ్లేషిస్తున్నారు.
Read Also: Rajagopal Reddy: అప్పుడు ఫైర్.. ఇప్పుడు సైలెంట్.. రాజగోపాల్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!