ఇదే రకం రెచ్చగొట్టుడు రాజకీయం. అయితే మతతత్వం. లేదా రెచ్చగొట్టే విధానం. ఇవే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నేతలు పాటిస్తున్నది. బహుశా ఇలా చేస్తేనే తప్ప.. షార్ట్ కట్లో అధికారంలోకి రామని డిసైడైపోయినట్టుంది. మొన్నటికి మొన్న హిందూ విద్యార్థులంతా బొట్టు పెట్టుకుని బడులకు పోవాలనే రూల్ తెస్తామన్నాడు బండి సంజయ్.
ఆటోలపై జై శ్రీరామ్ అని రాసుకోవడంపై తనదైన రాజకీయం చేసింది బీజేపీ. ఓ ఆటోను కూడా కొనిచ్చాడట.. ఆ డ్రైవరుకు బండి. ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి.. కూడా జనాలను రెచ్చగొట్టే విషయంలో మరో అడుగు ముందుకేశాడు. ఈయన గెలిచింది ఫస్టు సారే. కానీ మాట్లాడే విధానం మాత్రం.. బీజేపీలో ఏ సీనియర్ నేత కూడా ఇంతలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఉండడు ఇప్పటి వరకు.
ఎప్పుడూ ఏదో రకంగా ఇలా వార్తల్లో నిలుస్తాడన్నమాట. ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. మళ్లీ అతగాడు రచ్చ రాజకీయంలో భాగంగా తనదైన శైలిలో కామెంట్లు చేసి వార్తల్లోకెక్కాడు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన స్కూటీల షోరూంలకు జొరబడి ఆ స్కూటీలు ఎత్తుకుపోవాలన్నాడు. అంతటితో ఆగలేదు. కళ్యాణలక్ష్మీలో భాగంగా తులం బంగారం కూడా ఇస్తానన్నాడు కదా..? కాంగ్రెస్ లీడర్ల మెడల్లోంచి బంగారు చైన్లు లాక్కుపోండి.. నేనుంటాను మీకు.. తోడుగా! అన్నాడు.
ఆ దొంగతనం చేసిన బంగారు చైన్ను వెంటనే ఎంతుందో వెయిట్ చూసి ఆ రిసిప్ట్ కూడా పంపమన్నాడు. లేదంటే పోయిన బంగారం కన్నా రెండు, మూడింతలు ఎక్కువ చెప్తారు వాళ్లు అని వెటకారం చేశాడు. మొత్తానికి జనాలను దొంగలుగా, చైన్ స్నాచర్లుగా అవతారమెత్తమన్నాడు ఈ ఎమ్మెల్యే. ఇదీ అక్కడ జరుగుతున్న సంగతి.
మరి స్కూటీల షోరూంలు ఎక్కడున్నాయో కనుక్కుని నీ ఆధ్వర్యంలో, నీ బీజేపీ నేతలతో కలిసి ఆందోళన చేయవచ్చు కదా? మధ్యలో జనాన్ని ఎందుకు దొంగలుగా మారమని ఉద్బోధించడం? కాంగ్రెస్ లీడర్ల మెడల్లోంచి బంగారం గుంజుకు రమ్మన్నాడు బాగుంది.. ఆ నేతల భార్య మెడల్లోంచి పుస్తెల తాడును లాక్కురమ్మని అనలేదు. ఏమో ఆవేశంలో.. అలా కూడా అని ఉండేవాడు. రాకేశ్ రెడ్డా మజాకా? మరి. అంటున్నారు అక్కడి ఆర్మూర్కు చెందిన ప్రజలు.
మొన్నొక హైదరాబాద్కు చెందిన బీజేపీ నాయకుడన్నాడు. ఎవరిదో మెడ నరికి తీసుకురండి.. నేనే ఏ1 నిందితుడిగా పోలీసుల వద్ద లొంగిపోతానని. అంతలా రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతోంది తెలంగాణ బీజేపీ. ఫీజు రియంబర్స్మెంట్పై నిజామాబాద్లో ఆందోళన చేపట్టారు. బాగుంది. ఇలాంటి ఆందోళనలు, నిరసనలు తెలియజేయవచ్చు కదా? ప్రజా స్వామ్యంలో నిరసన రూపాలెన్నైనా చేయవచ్చు. మధ్యలో జనాన్ని దోషులుగా చేసేలా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే ఇక్కడ ఆక్షేపణీయంగా మారింది. ఈయన గారు చెప్పగానే జనాలు పోలోమని ఏం పోవడం లేదు కానీ, మీడియాలో వార్తల్లోకెక్కెటందుకు, పార్టీని ఏ విధంగానైనా లైమ్లైట్లో నిలిపేందుకు.. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలకు దిగాలా? అనేదే ఇప్పుడు చర్చ.