King Charles Coronation: బ్రిటన్ రాజుగా ఛార్లెస్ 3 పట్టాభిషేకం వైభవంగా జరిగింది. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించి సింహాసనాన్ని అధిష్టించారు ఛార్లెస్. రాజుతో పాటు రాణిగా.. కెమిల్లా కిరీటం అలంకరించారు. రాజకుటుంబీకులు, పలుదేశాల ప్రముఖులు, 2 వేల మందికిపైగా అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిందీ వేడుక.
పట్టాభిషేకం కోసం సంప్రదాయంగా వస్తున్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునీకరించిన డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు వచ్చారు ఛార్లెస్ దంపతులు.
కాంటెర్బరీ ఆర్చ్బిషప్ తొలుత రాజును పరిచయం చేశారు. మీరు ఛార్లెస్ను రాజుగా అంగీకరిస్తున్నారా? అని ఆహుతులను అడిగారు. వారు అంగీకరిస్తున్నట్టు చెప్పగా.. అనంతరం చట్టాన్ని కాపాడతానని, న్యాయ పరిరక్షణ కోసం కృషి చేస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. చర్చి ఆఫ్ ఇంగ్లండ్కు నమ్మకస్తుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్గా ఉంటానంటూ మరో ప్రమాణం కూడా చేశారు ఛార్లెస్. ఆ తర్వాత గాడ్ సేవ్ కింగ్ అంటూ ఆహుతులంతా ఆలపించారు. విభిన్న మత ప్రార్థనలు జరిగాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బైబిల్లోని కొన్ని పంక్తులను చదివి వినిపించారు.
ప్రమాణాలు చేసిన తర్వాత ఛార్లెస్.. వెయ్యేళ్ల నాటి సింహాసనంపై కూర్చున్నారు. 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ దానిని తయారు చేయించారు. ఇటీవలే దీనికి కొత్త సొబగులు అద్దారు. సింహాసనంపై కూర్చున్న రాజును పవిత్ర నూనెతో ఆర్చ్బిషప్ అభిషేకించారు. శతాబ్దాలనాటి స్పూన్తో నుదురు, చేతులు, ఛాతీపై నూనెను పోశారు. ఈ మతపరమైన కార్యక్రమమంతా తెరచాటున జరిగింది.
ఛార్లెస్కు బంగారు తాపడంతో చేసిన మహారాజ గౌన్ను ధరింపచేశారు. సిలువతో ఉన్న గోళాకార బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆయనకు ఆర్చ్ బిషప్ అందజేశారు. ఛార్లెస్ కుడిచేయి నాలుగో వేలుకు పట్టాభిషేక ఉంగరాన్ని తొడిగారు.
వంద దేశాల నుంచి అతిథులు ఈ పట్టాభిషేకానికి విచ్చేశారు. జపాన్ యువరాజు అకిషినో నుంచి స్పెయిన్ వరకు కింగ్ ఫెలిపీ-6 వరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాచరికాన్ని వదులుకుని రాజకుటుంబానికి దూరమైన ఛార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ కూడా పట్టాభిషేకానికి విచ్చేశారు. ఆయన భార్య మేఘన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు మాత్రం రాలేదు.