ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీలు గడ్డు పరిస్థుతుల్లో ఉన్నప్పుడు కూడా క్యాడర్ పార్టీలను అంటిపెట్టుకునే ఉంది. పార్టీని వీడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన తమని ఇప్పుడు కూటమి నేతలు పక్కన పెడుతున్నారని కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. జిల్లాలో గత వైసీపీ పాలనలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైన టీడీపీ క్యాడర్ పార్టీ బలోపితం కోసం పాటుపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో కూటమి పార్టీలు సీట్లు గెలుచుకున్నాయి. పార్టీ క్యాడర్ బలంగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో సీట్లు సాధించాయనడంలో సందేహం లేదు.
అయితే అధికారంలో వచ్చిన తర్వాత కూటమి పార్టీలోని కిందిస్థాయి నాయకత్వం, క్యాడర్ డీలా పడుతున్నారంట. కూటమి పెద్దలు అధికారంలోకి రాగానే జిల్లాలోని క్యాడర్ను విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను ఎంచక్కా కబ్జా చేసి దోచుకున్న నేతల అనుచరులను ఇప్పుడు టీడీపీ పెద్దలు పార్టీలో చేర్చుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదంట.
కడప జిల్లాలో మేజర్ నియోజకవర్గంగా పేరు పొందిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరులుగా ఉన్న వారు ఇప్పుడు టీడీపీలో చేరారు. రాచమల్లు సహా ఆయన అనుచరులందరిపై తీవ్ర ఆరోపణలున్నాయి. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే కొందరు టీడీపీలో చేరారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఎంచక్కా కబ్జా చేసి.. దందాలు చేశారని ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆరోపణలు ఉన్న నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీ వైపు చూడడానికి రీజన్స్ ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కూటమి అధికారంలో వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, భూ దందాలపై విచారణ చేపడుతుంది. ఈ విచారణలను,కేసులను తప్పించుకోవడానికి నాయకులు గోడ దూకుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
Also Read: అద్దంకి వైసీపీ ఇన్చార్జ్ రేసులో.. కరణం బలరాం
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని పక్కనపెట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత పాలకుల అనుచరులను పార్టీలోకి తీసుకుని ప్రాధాన్యత ఇస్తుండటంపై క్యాడర్ ఆవేదనకు గురి అవుతున్నారట. జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల అనుచరులుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు కూటమి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అధికారంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కూటమి పార్టీల్లోకి చేరిపోతున్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సొంత క్యాడర్ ని పట్టించుకోకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల అనుచరులను జిల్లా పెద్దలు పార్టీలోకి ఆహ్వానించడంపై కూటమి క్యాడర్లో కొంత అసహనం మొదలైందట. వైసీపీ హయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తప్పుడు కేసులలో జైలుకు పోయి పార్టీ కోసం రాత్రనకా పగలనకా పనిచేసిన కేడర్ ని పక్కన పెట్టడంపై కిందిస్ధాయిలో నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కాకముందే జిల్లా టీడీపీ కేడర్లో అంతఅసమ్మతి రావడంపై జోరుగా చర్చ జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో పార్టీల పెద్దలు జిల్లాలోని అసమ్మతిని ఎలా సర్దుబాటు చేస్తారన్నది వేచి చూడాలి.