Kadiri YSRCP: గత ఎన్నికల్లో కదిరి వైసీపీ టికెట్పై పూల శ్రీనివాస్ రెడ్డి భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, ముస్లిం ఓటర్ల ప్రాధాన్యత దృష్ట్యా అధినేత వైఎస్ జగన్.. మగ్బూల్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికల తర్వాత ఓటమిపాలైనా మగ్బూల్కే కదిరి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే పూల శ్రీనివాస్ రెడ్డిలో అసంతృప్తి మొదలైంది. నిత్యం వివాదాస్పదంగా మాట్లాడటం, పరోక్షంగా మగ్బూల్ను టార్గెట్ చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు.
సౌమ్యుడైన మగ్బూల్ వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుపోతుంటే.. శ్రీనివాస్ రెడ్డి తీరు దూకుడుగా వెళ్లారు. తాజాగా జరిగిన వైసీపీ సమావేశానికి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా హాజరైన ఆయన.. మహిళా నేతలున్నారన్న కనీస స్పృహ లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూసి కంగుతిన్న వైసీపీ కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. పార్టీకి తీవ్ర నష్టం తెచ్చేలా వ్యవహరిస్తున్న శ్రీనివాస్రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా, బహిరంగ వేదికలపై ఇలా మాట్లాడటం పార్టీకి పెను ముప్పని కేడర్ ఆందోళన చెందుతోంది. పదవులు ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేయాలి కానీ, ఇలా గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోయడం ఏంటని మండిపడుతున్నారు. జగన్ ఎవరికి ఇంచార్జీ పదవి ఇస్తే వారి వెంటే నడుస్తామని స్పష్టం చేస్తున్నారు. చెవిలో జోరీగలా డిస్టర్బెన్స్ సృష్టిస్తున్న శ్రీనివాస్ రెడ్డి తీరుపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసారు. మరి దీనిపై జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.
Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?