ఎర్రగొండపాలెం నుంచి మొదటిపారి పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్
తాటిపర్తి చంద్రశేఖర్ ఇప్పుడు ఈ పేరు వైసిపితో పాటు ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే గా మొదటిసారి ఎన్నికలలో పోటీచేసి , కూటమి గాలిని తట్టుకుని తాటిపర్తి చంద్రశేఖర్ అనూహ్య విజయం సాధించారు . గత వైసీపీ ప్రభుత్వంపై ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఎదురైనా చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గట్టెక్కి.. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది టీమ్లో ఒకరయ్యారు.
బాలినేని అనుచరుడిగా ఎర్రగొండపాలెం టికెట్ దక్కించుకున్న తాటిపత్రి
ప్రస్తుతం జనసేనలో ఉన్న, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో వైసిపి టికెట్ దక్కించుకోగలిగారు. ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ధిగా తన రాజకీయ గురువు బాలినేని పరాజయం పాలైనా చంద్రశేఖర్ గట్టెక్కగలిగారు. ప్రస్తుతం బాలినేని వైసీపీని వీడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టి బలోపేతం దిశగా అడుగులు వేస్తుండటంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాజకీయ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీలో తీవ్ర ఏవమానాలు ఎదుర్కొన్న బాలినేని
తాజాగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఒంగోలు కార్పొరేషన్లో జనసేన జెండా ఎగురవేసే దిశగా బాలినేని అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకియ పరిణామాలు మరింత ఇంట్రస్ట్గా మారాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి… అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు.
ఎన్నికల ముందు బాలినేని ప్రతిపాదనల్ని పట్టించుకోని జగన్
జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన బాలినేని మాట గత ఎన్నికల సమయంలో చెల్లుబాటు కాలేదు. ఎమ్మెల్యే అభ్యర్ధులతో పాటు ఆఖరికి ఒంగోలు ఎంపీ అభ్యర్ధి విషయంలోనూ బాలినేని చేసిన ప్రతిపాదనలు జగన్ పట్టించుకోలేదు.. సొంత బంధువైన జగన్ అలా అవమానించడంపై కినుక వహించిన బాలినేని ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పరిచయాలతో జనసేన బలోపేతంపై దృష్టి పెట్టారు.. అందులో భాగంగా ఆ ఆపరేషన్ను ప్రకాశం జిల్లా నుంచే స్టార్ట్ చేసి.. ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీని దాదాపు ఖాళీ చేశారు.
వైసీపీ కీలక నేతలతో టచ్లో ఉన్న బాలినేని
ప్రకాశం జిల్లాలో వైసీపీ లేకుండా చేస్తానంటున్న బాలినేని.. అదే రూటులో జిల్లాలోని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు, వైసిపిలోని కీలక నేతలను జనసేన పార్టీలో జాయిన్ చేయించడానికి రూట్ రెడీ చేసుకుంటున్నారంట. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావును జనసేన ప్లీనరీ రోజు పవన్కళ్యాణ్ సమక్షంలో పార్టీలోకి తసుకురావడటానికి లైన్ క్లియర్ చేశారంట. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ను జనసేన లో జాయిన్ చేయటానికి బాలినేని ప్లాన్ చేసినట్లు వైసీపీలోని ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తుంది.
సీనియర్లకు మింగుడు పడని చంద్రశేఖర్ దూకుడు
పార్టీ మారతారన్న ప్రచారాలను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఖండిస్తున్నప్పటికీ.. వైసీపీలోని ఓ వర్గం ప్రచారం ఆయన్ని టార్గెట్ చేయడం ఆపడం లేదు. మొదటి నుంచి ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తు వైసిపి అభిమానులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ దూకుడే వైసీపీలోని సీనియర్లకు మింగుడు పడటం లేదన్న టాక్ వినపడుతుంది. తన స్పీడ్తోనే సొంత పార్టిలోని కొంత సీనియర్లకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ టార్గెట్ అయ్యారని తెలుస్తుంది.
ఆదిమూలపు సురేష్ ని కొండేపికి షిప్ట్ చేసిన జగన్
వైసీపీ ఎన్నికల మందు అభ్యర్ధులను, సిట్టింగుల నియోజకవర్గాలను ఇష్టానుసారం మార్చేసి ఎన్నికలకు వెళ్ళింది. ఆ క్రమంలో ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి ఆదిమూలపు సురేశ్ను జగన్ కొండేపీకి షిఫ్ట్ చేశారు. ఆదిమూలపు అక్కడ పోటిచేసి ఓటమి పాలయ్యారు. కొండెపిలో ఓడిపోయిన సురేశ్ మళ్లీ ఎర్రగొండపాలెం రావాలని చూస్తున్నారంట. అందులో భాగంగానే ఎర్రగొండపాలెంలోని సురేష్ వర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్పై పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయిస్తుందంట. ఇటు ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గం అదిమూలపు సురేశ్ టీడీపీలోకి వెళ్తున్నట్లు రూమార్లు సృష్టిస్తోంది. దాంతో ఇద్దరు నేతల్లో పార్టీలో ఉండేదెవరో? జంప్ అయ్యే దెవరో? అంతుపట్టక వైసీపీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైందంట.
తప్పుడు ప్రచారాలని మండిపడుతున్న చంద్రశేఖర్
తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీరు చర్చకు దారితీసింది. వైసీపీ సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే , ఎర్రగొండపాలెంట ఎమ్మెల్యే మాత్రం పార్టీ కండువా లేకుండా అసెంబ్లీ వెళ్లారు. దాన్ని గమనించిన జగన్, సదరు ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేశారంట. దాన్ని ఫోకస్ చేస్తూ చంద్రశేఖర్ తన రాజకీయ గురువు బాలినేని బాటలో జనసేనలో చేరడం ఖాయమైందని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం ఉధృతం చేస్తోంది.
హాట్టాపిక్గా మారిన చంద్రశేఖర్ భవితవ్యం
అయితే ఆ ప్రచారాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఖండిస్తున్నారు. కావాలనే కొంతమంది తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డాడు. వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని, అందుకే ఆ దుష్ప్రచారం జరుగుతోందని తాటిపర్తి కూటమి పార్టీలపై రివర్స్ కౌంటర్లకు దిగి.. దాను పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గం తాటిపర్తి పార్టీ మార్పుపై చేస్తున్న ప్రచారం ఎర్రగొండపాలెం వైసీపీలో తీవ్ర గందరగోళం రేపుతోంది. ఎమ్మెల్యే తాను వైసీపీలోనే ఉంటానని పదేపదే చెప్తున్నా నమ్మే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మరి చూడాలి జిల్లాలో వైసీపీని భూస్థాపితం చేస్తానంటున్న బాలినేని యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో.