22ఏ నిషేధిత జాబితా గుట్టు విప్పు విప్పు అంటే ఇవాళ రేవంత్ ఇలా చిట్టా విప్పారు. బాగోతం అంతా చదివి వినిపించారు. కడుపు చించు కుంటే కాళ్ల మీదే పడతుందున్నట్టుగా..ఒక వేలు రేవంత్ ను చూపితే నాలుగు వేళ్లను పదేళ్ల పాలన భూదోపిడీపై ఎత్తి చూపినట్టయ్యింది పరిస్థితి.
ఇది ఎక్కడిదాకా పోయిందంటే.. కలుగులోంచి ఎలుకను బయటకు తీసినట్టుగా .. ఫామ్హౌజ్కే పొగబెట్టేదాకా పోయింది. అసలు ఆ ఫామ్హౌజ్ భూములే వివాదస్పదమైనవని తేల్చేశారు సీఎం. దాదాపు 390 ఎకరాలకు రికార్డులే లేవన్నారు. 700 ఎకరాలు ఫామ్హౌజ్ పరిధిలో ఉన్నాయన్నారు. వీటిపై విచారణకు ఆదేశించిన సీఎం.. నెల రోజుల్లో నిగ్గు తేల్చాలని లేదంటే అధికారులపై చర్యలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇన్నాళ్లు ఫామ్హౌజ్కు వాడుకున్న ఆ భూములను దళితులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేస్తానని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. జన్వాడా లోని కేటీఆర్ ఫామ్హౌజ్ భూములు సత్యం రామలింగరాజు ఆస్తులని వివరాలు బయటపెట్టారు. రంగనాయక సాగర్ వద్ద అగ్వసగ్వకు హరీశ్రావు 14 ఎకరాలు తీసుకున్నాడని, 5 కోట్లతో ఆ భూమిలో రోడ్డు వేయించుకున్నాడని వివరించారు రేవంత్.
ధరణితో హరీశ్రావు మామ హన్మంతరావు, మహేశ్ రావులు 120 ఎకరాలు మార్చుకున్నారన్నారు. ఇనాం భూములను జగదీశ్రెడ్డి తన పేరు మీద మార్చుకున్నాడన్నారు. రోహిన్రెడ్డి అసైన్డ్ భూముల్లో ఫామ్హౌజ్ కట్టుకున్నారని, బుల్లెట్ ట్రైన్ కోసం ఇచ్చిన భూమిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, గంగుల కమలాకర్ కొల్లగొట్టారని బయటపెట్టారు సీఎం. 74 ఎకరాల భూదాన్ భూములు కొల్లగొట్టారన్నారు.
నమస్తే తెలంగాణ పేరు మీద ఉన్న భూముల వివరాలను కూడా త్వరలో బయటపెడతానన్నారు సీఎం. వినోద్ రావు తమ్ముడు, పల్లా రాజేశ్వర్రెడ్డిలు వట్టినాగుల పల్లెలో భూదాన్ భూములను తమ పేర్లపై మార్చుకున్నారన్నారు. సిరిసిల్లలో 8వేల ఎకరాల భూములను కేటీఆర్ తన బంధువులకు ఇచ్చారని తెలిపారు సీఎం. అక్కడి కలెక్టర్ వీటిల్లో 2400 ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో లక్ష కోట్ల విలువ గల భూములను కొల్లగొట్టారన్నారు. వీటన్నింటి మీద విచారణ చేయిస్తున్నామని, ధరణి భూదోపిడీపై సిట్ వేశామన్నారు. టీజీఐఐసీ భూమిలో జరిగిన దోపిడీని బడ్జెట్ సెషన్లో బయటపెడతానని ప్రకటించారు అసంబ్లీ వేదికగా. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు భూములు సర్వం కోల్పోయారని, ఉద్యమకారుడని చెప్పుకుంటున్న కేసీఆర్ వేల కోట్ల రూపాయల వందల ఎకరాలు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం.
కేసీఆర్, కేసీఆర్ సతీమణి పేరిట సిద్దిపేట జిల్లాలో 65 ఎకరాలు ఉందని, కేటీఆర్ పేరు మీద 49 ఎకరాలు, షాలిమా పేరు మీద 17.30 ఎకరాలు, అలేఖకు 9.38 ఎకరాలు, హిమాన్షుకు 46.3 ఎకరాల భూమి ఉందన్నారు. కవిత పేరు మీద 14 ఎకరాలు, అనిల్కు 23 ఎకరాలు, 37 ఎకరాలు ఉందన్నారు.
జోగినపల్లి రవీందర్ రావు కు ఎర్రవల్లిలో 53 ఎకరాలు, సంతోష్ కుమార్కు 18 ఎకరాలు, అతని భార్య రోహిణికి 7 ఎకరాలు, మొత్తం ఈ కుటుంబం పేరు మీద 79 ఎకరాల భూమి ఉందన్నారు సీఎం. ఎమ్మెల్సీ నవీన్కుమార్ రావు పేరు మీద 97 ఎకరాలు ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన వారి పేర్ల మీద మొత్తం 439 ఎకరాల భూమి ఉందన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న కోటి ఎకరాల పై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏయే కేటగిరీకి చెందిన భూములన్నాయో వివరించిన ఆయన .. ఇందులోంచి ఇంచు భూమిని కూడా తీసేయడానికి ప్రభుత్వానికి హక్కు లేదని తేల్చిపారేశారు. దీంతో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఆరోపిస్తూ వచ్చిన 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై ఖుల్లం ఖుల్లాగా తేల్చిపారేసిన సీఎం.. పనిలో పనిగా బీఆర్ఎస్ నేతల భూ బాగోతం గుట్టు విప్పారు అసెంబ్లీ సాక్షిగా.
తామొకటి తలిస్తే.. రేవంత్ ఇలా తమ గుట్టే బయటపెట్టారని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు లబోదిబోమనే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసిన జనాలు నోళ్లు వెళ్లబెట్టారు. తెలంగాణ తెచ్చుకుంటే మా బతుకులు బాగుపడలే కానీ, నీతులు చెప్పిన నేతలు వేలకు వేల ఎకరాలు సంపాదించుకున్నారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మా బతుకులు మారలేదు.. మా జీవితాలూ బాగుపడలేదు. కానీ మీరంతా బాగా బాగుపడ్డారు. భూములు సంపాదించుకున్నారు.. అనే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.