Adani Helicopter Pact: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ హెలికాఫ్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అదానీ గ్రూప్ ఇటలీ కంపెనీ లియోనార్డోతో ఇవాళ ఒప్పందం చేసుకుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా చేసుకున్న ఈ ఒప్పందం హెలికాప్టర్ తయారీ రంగానికి ఊతం ఇస్తుందని అదానీ సంస్థ తెలిపింది. హెలికాప్టర్ల తయారీలో భారతదేశం స్వావలంబనను ఇది సహాయపడుతుందని పేర్కొంది.
మంగళవారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్, ఇటలీకి చెందిన లియోనార్డో గ్రూప్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం భారత డిఫెన్స్ రంగ అవసరాలను తీరుస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా లియోనార్డో ఉత్పత్తి చేస్తున్న అధునాతన AW169M, AW109 ట్రెక్కర్ఎమ్ హెలికాప్టర్లు ఆర్మీ శక్తిసామర్థ్యాలను మరింత పెంచుతాయని అంటున్నారు. ఈ ఒప్పందంలో దశలవారీగా స్వదేశీకరణ, నిర్వహణ, మరమ్మత్తులు, సమగ్ర పైలట్ శిక్షణ భాగంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రాబోయే 10 సంవత్సరాలలో దేశానికి ఏటా దాదాపు 100 హెలికాప్టర్లు అవసరమవుతాయని అదానీ గ్రూప్ తెలిపింది. పౌర, రక్షణ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం పునాది వేస్తున్నట్లు అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ అన్నారు. లియోనార్డోతో ఒప్పందం దేశీయ హెలికాప్టర్ తయారీ రంగానికి ఎంతో కీలకం అన్నారు. రెండు సంస్థలు కలిసి హెలికాప్టర్ల తయారీ, అసెంబ్లీ, శిక్షణ, ప్రపంచ స్థాయి మద్దతుతో ఒకే సమగ్ర వ్యవస్థను భారత గడ్డపై నిర్మిస్తాయని అదానీ గ్రూప్ తెలిపింది.
Also Read: గంటల్లోనే వేల కోట్ల రూపాయలు కోల్పోయిన అంబానీ, అదానీ
భారత్ ఒక పెద్ద మార్కెట్, దేశ సాయుధ దళాలకు హెలికాప్టర్ల అవసరం పెరుగుతుందని లియోనార్డో హెలికాప్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జియాన్ పియరో కుటిల్లో అన్నారు. అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, బ్రెజిలియన్ మేజర్ ఎంబ్రాయేర్ ఇటీవల విమానాల తయారీపై ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.