Arava Sridhar: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేపుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు పార్టీ ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ మంగళవారం రైల్వేకోడూరుకు చేరుకుని విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను కమిటీ సభ్యులు దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక ఉన్న నేపథ్యం, తన వివరణను శ్రీధర్ కమిటీ ముందు ఉంచారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే.. విచారణ కేవలం ఎమ్మెల్యే వివరణతోనే ఆగలేదు. అరవ శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత.. కమిటీ సభ్యులు స్థానిక జనసేన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే తన వాదనలో పేర్కొన్న అంశాలు వాస్తవమేనా? క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టకు ఈ ఘటనతో జరిగిన నష్టం ఎంత? అనే కోణంలో నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పార్టీలోని కీలక నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుల్లో ఉన్న తీవ్రతను అడిగి తెలుసుకున్నారు.
ఈ అంతర్గత సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని సంకేతాలు పంపుతున్న జనసేన నాయకత్వం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే అరవ శ్రీధర్ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది. స్థానిక నేతలు ఇస్తున్న సమాచారం.. ఎమ్మెల్యే ఇచ్చిన వివరణల మధ్య పొంతన ఉందో లేదో అని కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ఉదంతం ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
Also Read: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సాయంత్రం 5 గంటలకే డెడ్లైన్, ఇక తేల్చుకోవడమే..!