Anant Ambani wedding 3 Falcon,100 private jets: అపర కుభేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జూన్ 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా కీలక ఘట్టాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఇటీవల జరిగిన మామేరు వేడుక ఆకట్టుకుంది. దీంతో పాటు సంగీత్ ఘనంగా జరిగింది. ఇందులో ఇంటిల్లిపాది సభ్యులు పాల్గొని డ్యాన్స్లతో సందడి చేశారు.
జూన్ 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిగే వివాహ వేడుకలకు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో సౌదీ అరామ్కో సీఈఓ అమిన్ నాసర్, హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ భారతీయ సంతతికి చెందిన సీఈఓ శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈఓ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ మేరకు అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
3 ఫాల్కన్ 2000 జెట్లు, 100 విమానాలు..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి హాజరయ్యే ముఖ్య అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా 100 విమానాలు, మూడు ఫాల్కన్ 2000 జెట్లు అద్దెకు తీసుకున్నారు. అతిథులను తీసుకొచ్చేందుకు వీటిని ఉపయోగించనున్నారు. కాగా, జూన్ 12 న వివాహం, జూన్ 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. అయితే ఈ అన్ని వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరగనున్నాయి.
అంబానీ వివాహ వేడుకల్లో అతిథులకు ఇచ్చే విందు కోసం వారణాసిలోని ప్రసిద్ధి చెందిన ‘కాశీ చాట్ భండార్’ నుంచి స్పెషల్ ఐటమ్స్ ఉండనున్నాయి. ఇందులో కుల్పీ, ఫాలుదా, టిక్కి, టమాట చాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్, ఫాస్ట్ ఫుడ్ లాంటి ప్రత్యేక వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేశారు. ఈ వంటకాలను ముఖేష్ అంబానీచే స్వయంగా ఎంపిక చేసిటన్లు కాశీ ఛాట్ భండార్ యజమాని రాకేష్ కేసరి చెప్పారు.
Also Read: సమస్యల ప్రభం‘జనం’: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
అంబానీ వివాహం నేపథ్యంలో ముంబైలో హోటళ్ల ధరలు పెరిగాయి. ముంబైలోని పశ్చిమ సబర్బ్ బాంద్రా, బీకేసీలోని హోటల్ గదులు మొత్తం బుకింగ్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జులై 10 నుంచి 14 వరకు గదులు అందుబాటులో లేవని ప్రకటించారు. ది లలిత్, ఐటీసీ మరాఠా, తాజ్ శాంతా క్రజ్, గ్రాండ్ హయత్, బీకేసీ ప్రాంతానికి సమీపంలోని 5 స్టార్ హోటళ్లలో కొన్ని గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.