Anil Ambani: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ.. సీబీఐ గట్టిగా వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్)కు సంబంధించిన భారీ బ్యాంకు రుణ మోసం కేసులో దర్యాప్తు సంస్థలు తమ చర్యలను ముమ్మరం చేశాయి. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయిలోని అనిల్ అంబానీ విలాసవంతమైన నివాసం ‘అబోడ’ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అటాచ్ చేశారు. సుమారు రూ.3,716 కోట్ల విలువైన ఈ భవనం అటాచ్మెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ.40 వేల కోట్ల మేర బ్యాంకు రుణ మోసాలకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
వరుస విచారణల నేపథ్యంలో అనిల్ అంబానీ ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఆయన ఈ కేసుపై అధికారుల ముందు హాజరై వివరణ ఇచ్చారు. తాజా విచారణలో నిధుల మళ్లింపు.. విదేశీ లావాదేవీలపై అధికారులు ప్రశ్నలు కురిపిస్తున్నట్లు సమాచారం. ఈడీ విచారణ కొనసాగుతుండగానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అనిల్ అంబానీపై మరో బాంబు పేల్చింది. ఆర్కామ్.. అనిల్ అంబానీలపై రెండో “బ్యాంక్ మోసం” కేసు నమోదు చేసి.. ఆయన నివాసం.. కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కొత్త కేసు నమోదైంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ.2,220 కోట్ల మేర మోసం చేశారని.. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను సీబీఐ తన అధికారిక ‘X’ వేదికగా వెల్లడించింది. కుట్ర.. అధికార దుర్వినియోగం.. నిధుల మళ్లింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబయిలోని అనిల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్కామ్ కంపెనీ వ్యవహారాల్లో జరుగుతున్న లోతైన దర్యాప్తు అనిల్ అంబానీకి పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది.
వరుసగా రెండు దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించడంతో అనిల్ అంబానీ చుట్టూ కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు వేల కోట్ల ఆస్తుల అటాచ్మెంట్.. మరోవైపు కొత్త కేసులు నమోదు కావడంతో రిలయన్స్ గ్రూప్ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులను తప్పుదోవ పట్టించి రుణాలు పొందడం.. వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం వంటి తీవ్ర ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Read Also: NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ