Customer Fine Policy: నగరాల్లో కేఫ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడానికి వెళ్లి చాలా మంది గంటలకొద్ది కేఫ్ లోనే గడుపుతున్నారు. ముచ్చట్లు పెట్టుకోవడానికి, చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఈ కాఫీ – టీ షాప్స్, కేఫ్ లను అడ్డాగా మార్చుకుంటున్నారు. ఫలితంగా అక్కడి టేబుళ్లు గంటల తరబడి ఆక్యూపై అవుతున్నాయి. దీంతో కొత్త కస్టమర్లకు చోటు దక్కడం లేదన్న అసంతృప్తి కేఫ్ నిర్వాహకుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు బెంగళూరు హోటల్ యజమానాలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గరిష్ట ఆర్డర్ లేకుండా ఎక్కువ సమయం గడిపే కస్టమర్లకు జరిమానాలు లేదా టేబులు ఛార్జీలు విధించనున్నట్లు బెంగళూరు హోటల్ యాజమానుల సంఘం హెచ్చరించింది. బేసిక్ ఆర్డర్ ఇచ్చి.. కొందరు గంటల తరబడి టేబుళ్లను ఆక్రమించుకోవడం వల్ల ఇతర కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొంది. కాబట్టి అసౌకర్యాన్ని కలిగిస్తున్న కస్టమర్లకు వారి బిల్లుపై 10 రెట్లు నగదును జరిమానా కింద వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కస్టమర్ల నుంచి ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి హోటల్ యజమానులు వాహనాల పార్కింగ్ ఛార్జీల తరహాలోనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఉచిత సీటింగ్ కు ఒక నిర్ధిష్ట సమయం వరకే అనుమతి ఇచ్చి.. ఆ పరిధి దాటితే యూజింగ్ చార్జీ లేదా జరిమానా విధించాలని యోచిస్తున్నారు. బెంగళూరు హోటల్ సంఘం అధ్యక్షుడు పి.సి. రావు మాట్లాడుతూ ‘ఒక టీ తాగిన తర్వాత ప్రజలు హోటల్స్ లో గంటల తరబడి కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఇతర కస్టమర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. మా వ్యాపారాలకు నష్టం వాటిల్లుతోంది. హోటల్స్ లో ఎక్కువసేపు కూర్చునేవారికి రాబోయే రోజుల్లో ఛార్జీ విధించాలని నిర్ణయించాం’ అని చెప్పుకొచ్చారు.
హోటల్ యజమానులు సూచించిన సమయం కంటే ఎక్కువ సేపు ఉన్నవారికి రూ.500 నుంచి రూ.1000 జరిమానా విధించాలని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అధికారికంగా అమలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. సుదీర్ఘమైన ఆక్యుపెన్సీని అరికట్టడం, కస్టమర్ల ఇబ్బందులను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి హోటల్ సంఘం తెలియజేయనుంది.
Also Read: Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!
ప్రస్తుతం బెంగళూరు పరిధిలోనే జరిమానా అంశాన్ని హోటల్స్ యజమానులు పరిశీలిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అమోదం లభిస్తే హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో దీనిపై చర్చ మెుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆ సమస్యే చాలా చోట్ల ఉంది. కాబట్టి కేఫ్ లలో కస్టమర్లకు నిర్ణీత సమయం మాత్రమే అనుమతి ఇవ్వడం, పరిధి దాటితే జరిమానాలు విధించే విధానం చాలా చోట్ల అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!