Gig Workers Strike: న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం ఫుడ్ డెలివరీ యాప్స్ లేదా క్విక్ కామర్స్ యాప్లపై ఆధారపడాలని అనుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలవరీ, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కంపెనీల డెలివరీ వర్కర్లు డిసెంబర్ 31, 2025న దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. ఆన్లైన్ డెలివరీల కోసం ఏడాదిలో అత్యంత రద్దీగా ఉండే రోజులలో డిసెంబర్ 31. సరిగ్గా అదే రోజు సేవలు నిలిపివేసి తమ డిమాండ్ ను సాధించుకోవాలని గిగ్ వర్కర్లు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సమ్మెకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నాయకత్వం వహిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని పలు ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్లతో సహా ప్రాంతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో లక్ష మందికి పైగా డెలివరీ కార్మికులు న్యూ ఇయర్ సందర్భంగా యాప్ల నుంచి లాగ్ అవుట్ అవుతారు లేదా పనిని క్రమంగా తగ్గిస్తారని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ఇటీవల క్రిస్మస్ రోజున కూడా ఇలాంటి నిరసన తెలిపిన గిగ్ వర్కర్లు.. మరోసారి న్యూ ఇయర్ సందర్భంగా సమ్మె ప్లాన్ చేశారు. స్పీడ్ డెలివరీలకు డిమాండ్ పెరిగినప్పటికీ గిగ్ ఆర్థిక వర్కర్ల ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తూనే ఉన్నాయని యూనియన్లు అంటున్నాయి. కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నా.. కార్మికుల పరిస్థితి దిగజారుతోందన్నారు. ఈ సమ్మె కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ఉద్దేశించిందన్నారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో భారీగా ఆన్ లైన్ ఆర్డర్లు వస్తుంటాయి. దీంతో తమ వ్యాపారం కోసమైనా కంపెనీలు కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటాయని యూనియన్లు నమ్ముతున్నాయి. హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, శంభాజీనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఫుడ్ ఆర్డర్లు, కిరాణా డెలివరీలు, వినియోగదారుల చివరి నిమిషంలో షాపింగ్పై సమ్మె ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
ఫుడ్ డెలివరీ రంగం, ఈ-కామర్స్ వేగంగా విస్తరిస్తున్నా..తమకు మాత్రం మెరుగైన జీతం, ఉద్యోగ భద్రత, సురక్షితమైన పని పరిస్థితులు ఏర్పడలేదని కార్మికులు అంటున్నారు. తక్కువ జీతం, ఎక్కువ పనిభారంతో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ నాయకులు అంటున్నారు. ప్లాట్ఫారమ్లు స్పీడ్, కస్టమర్ సౌలభ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని, కానీ వర్కర్లను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
Also Read: Indian Currency: ఒక్క రూ.500 నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!
దేశవ్యాప్తంగా డిసెంబర్ 25న సమ్మె చేశామని టీజీపీడబ్ల్యూ వ్యవస్థాపకుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. డెలివరీ వర్కర్లు తమ నిరసన తెలిపిన ప్రతీసారి కంపెనీలు వారి ఐడీలను బ్లాక్ చేయడం, పోలీసు ఫిర్యాదులతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటున్నారు. ఇది ఆధునిక దోపిడీ తప్ప మరొకటి కాదని అన్నారు. డిసెంబర్ 25న జరిగిన సమ్మెలో దాదాపు 40,000 మంది డెలివరీ కార్మికులు పాల్గొన్నారని, దీని వలన అనేక నగరాల్లో డెలివరీలలో దాదాపు 60 శాతం అంతరాయం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే బదులుగా, కంపెనీలు మూడో థర్డ్ పార్టీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్నాయని, ఐడీ బ్లాక్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.