ETF Vs Gold: భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంటుంది. బంగారాన్ని సంప్రదాయ పెట్టుబడిగా భావిస్తుంటారు. పెట్టుబడి విషయానికొస్తే.. బంగారు ఆభరణాలు, కాయిన్స్ కంటే గోల్డ్ ఈటీఎఫ్ లే బెటర్ అంటున్నారు నిపుణులు. జ్యువెలరీ, కాయిన్స్ కొనుగోలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే బంగారం కొనడానికే చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇది లాభదాయకం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
బంగారాన్ని ఆభరణాలు లేదా కాయిన్స్ రూపంలో కొనుగోలు చేస్తే 3% జీఎస్టీ చెల్లించాలి. అలాగే ఆభరణాలపై 5–8% మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. బంగారం ధరలు భారీగా పెరుగుతుండడంతో సెక్యూరిటీ పరంగా ఆందోళనలు ఉన్నాయి. దీంతో గోల్డ్ బ్యాంకు లాకర్ లో పెడితే 0.5–1% ఛార్జీలు వసూలు చేస్తారు. మీ పెట్టుబడిలో దాదాపు 10–15% ఛార్జీల రూపంలోనే ఖర్చు అవుతుంది. ఈ ఛార్జీలతో ఫిజికల్ గోల్డ్.. మార్కెట్ రేటుతో పోలిస్తే మంచి రిటర్న్స్ ఉండడం లేదు.
ఎలాంటి ఛార్జీలు లేకుండా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) బాగా ఉపయోగపడతాయి. గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈటీఎఫ్ లు మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. వీటిపై ఏడాదికి కేవలం 0.3–0.4% ట్యాక్స్ లు మాత్రమే ఉంటాయి. ఎలాంటి ఛార్జీలు, క్వాలిటీపై సందేహాలు, లాకర్ టెన్షన్లు ఉండవు. స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్గా బంగారాన్ని కొనడానికి, అమ్మడానికి ఈటీఎఫ్ లు ఉపయోగపడతాయి.
Also Read: పసిడి ప్రియులకు తీపి కబురు.. భారీగా పతనమైన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
గోల్డ్ ధరలు పెరుగుతుండడంతో.. ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ లపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. జనవరిలో మ్యూచువల్ ఫండ్స్ తో సమానంగా గోల్డ్ ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఆస్తిగానూ చూస్తున్నారు. పన్నుల విషయంలో బంగారం, ఈటీఎఫ్ లకు పెద్దగా తేడాలు లేవు. ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్ మూలధన లాభాలపై ట్యాక్స్ విధిస్తారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కంటే బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని ఓ సర్వేలో తేలింది.