PM Modi: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యల వెనుక ఏం జరిగింది? బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలని ఎందుకు సూచన చేశారు? విదేశీ మారక నిల్వలు బాగానే ఉన్నా, ఆయన మాటల వెనుక ఏం జరిగింది? రాబోయే ముప్పును ముందుగా ఊహించారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాబోయే ముప్పును పసిగట్టిన ప్రధాని మోదీ
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతోంది. దీని ఫలితంగా అన్ని రకాల ధరలు ఆకాశాన్ని తాకాయి. భారత్పై దాని ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో దేశం కోసం కొన్నినిర్ణయాలు తీసుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఏడాదిపాటు ఎవరు బంగారం కొనుగోలు చేయవద్దని అన్నారు.
ముఖ్యంగా దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా అవుతుందన్నారు. వస్తువుల రవాణా కోసం రైలు సేవలు వినియోగించుకోవాలని, అవి కరెంటుతో నడవడంతో వాటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదన్నారు. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ.. యుద్ధం వల్ల కలుగుతున్న పలు సమస్యలపై బహిరంగంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి.
ప్రపంచంలోనే బంగారం దిగుమతి చేసుకునే పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో విదేశీ కొనుగోళ్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. బంగారం దిగుమతులు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేయడం వల్ల దేశంలో దిగుమతులు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతుంది.
బంగారం కొనుగోళ్లపై ప్రధాని కీలక సూచన వెనుక
ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఈ ఆందోళన మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు, ఎరువుల ధరలు డాలర్ల తరలింపుపై ఒత్తిడిని పెంచాయి.
బంగారం దిగుమతులను తగ్గించడం వల్ల రూపాయిపై ఒత్తిడిని తగ్గించవచ్చు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. భారత్లో విదేశీ మారక నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. మార్చి 2026 చివరి నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ప్రస్తావించింది. దాదాపు 11 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతుందని పేర్కొంది.
దేశంలో విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా సెప్టెంబర్ 2025 నాటి 13.92 శాతం నుండి మార్చి చివరి నాటికి 16.7 శాతానికి పెరిగిందని వెల్లడించింది. క్రమంగా బంగారం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఏడాది పాటు గోల్డ్ కొనవద్దు, పెట్రోల్ సేవ్ చేయండి.. ప్రధాని మోదీ కీలక పిలుపు
మార్చి చివరినాటికి దేశంలో 880.52 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. రెండేళ్లుగా విదేశాలలో ఉన్న బంగారాన్ని క్రమంగా స్వదేశానికి రప్పిస్తూ దేశీయ బంగారం నిల్వల భద్రతను బలోపేతం చేస్తోంది ఆర్బీఐ. ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు బులియన్ నిల్వలను పెంచుతున్నాయి.
జరుగుతున్న పరిణామాలను ముందే పసిగట్టిన ప్రధాని మోదీ, బంగారం కొనుగోళ్లు, డెస్టినేషన్ వెడ్డింగ్, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచన చేశారు. ఈవీ వాహనాలు ఉపయోగించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.