RBI MPC Meeting: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. శుక్రవారం ముంబైలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం(MPC) జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. తాజా సమావేశంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 5.25 శాతం వద్దే కొనసాగించింది. 2026-27 బడ్జెట్ తర్వాత ఆర్బీఐ తొలి ద్వైమాసిక సమీక్ష నిర్వహించింది.
గతేడాది ఆర్బీఐ పలుమార్లు వడ్డీ రేట్లను సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత డిసెంబర్ లో మరో పావు శాతం కోత విధించింది. గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది.
ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీలో ఆరుగురు సభ్యుల రేటు నిర్ణయ ప్యానెల్ రెపో రేట్లను 5.25% వద్ద మార్చకుండా తటస్థంగా వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ 2025-26 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. 2026-27లో ఆర్థిక కార్యకలాపాలు బాగానే ఉంటాయని అంచనా వేసింది. 2026-27 తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.7% నుండి 6.9%కి, Q2 జీడీపీ వృద్ధిరేటు అంచనాను 6.8% నుంచి 7%కి పెంచింది.
2025 Q4 ధరలలో భారీ తగ్గుదలతో ప్రతికూల బేస్ ప్రభావాలు ఈ ఏడాది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తాయని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో 2.0% నుండి 2.1%కి పెంచింది. ఇది Q4 2026 ద్రవ్యోల్బణ అంచనాలను 2.9% నుండి 3.2%కి, Q1 2027 ను 3.9% నుండి 4.0%కి. Q2 2027 ద్రవ్యోల్బణ అంచనాలను గతంలో 4.0% నుండి 4.2%కి పెంచింది.