Stock Market Crash: అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రనేతలను కోల్పోయింది ఇరాన్. దీంతో పొరుగు దేశాలపై దూకుడు పెంచింది. ఫలితంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్. దీనిప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్పై పడింది. మార్కెట్ ప్రారంభంలో బీఎస్ఈ, నిఫ్టీ సూచీలు పతనమయ్యాయి. దీంతో 6 నుంచి 7 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.
పొరుగు దేశాలపై ఇరాన్ దూకుడు, మిస్సైళ్లతో చమురు క్షేత్రాలపై దాడులు
పశ్చిమాసియాలో గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. చమురు సరఫరా అంతరాయాలపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు మూడు శాతం పెరిగింది. ప్రస్తుతం 111 డాలర్లకు చేరుకుంది. ఇది మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్పై పడింది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీఎస్ సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నిఫ్టీ కూడా 500 పాయింట్లు పైగానే నష్టపోయింది. ఇంకా అక్కడే ట్రేడింగ్ కొనసాగుతోంది. దీని ఆధారంగా మార్కెట్లో మదుపరులు సంపద దాదాపు 6 లక్షల కోట్ల ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ ఎంట్రీతో 7 లక్షల కోట్ల సంపద ఆవిరి
నిఫ్టీ 50 అయితే 2 శాతం పైగానే నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ కేప్ కూడా రెండు శాతం పైగానే నష్టపోయింది. కేవలం మిడ్ కేప్లో ఆయిల్, సెయిల్ వంటి స్టాక్స్ మాత్రం లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.89 గా కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంతో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను యథాతధంగా ఉంచింది.
బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం గురువారం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్ మార్కెట్ నిక్కీ 2.74 శాతం, దక్షిణ కొరియా మార్కెట్ కొస్పి 2.50 శాతం పైగానే పతనమయ్యాయి.
దీనికితోడు ఖతార్లో కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడి గల్ప్లో ఉద్రిక్తతలను మరింత పెంచనుందనే ఆందోళన పెరుగుతున్నాయి. ఖతార్, సౌదీ ఆరేబియాలోని పలు చమురు క్షేత్రాల్లో ఉత్పత్తిని నిలిపి వేశాయి.
ALSO READ: ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ప్రారంభం.. క్షణాల్లో గ్యాస్ సిలిండర్, 24 గంటలు అందుబాటులో