LPG Gas ATM: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. అంతేకాదు కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురుగ్రామ్లో ఏర్పాటు చేసిన ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం అందరినీ ఆకట్టుకుంటోంది.
దేశంలో ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ప్రారంభం
హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేసిన ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఉత్తర భారతంలో మొట్ టమొదటి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎమ్. సిలిండర్లో గ్యాస్ అయిపోగానే ఇకపై గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 2 నుండి 3 నిమిషాల్లో నింపిన సిలిండర్ను ఏటీఎం ద్వారా తేవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పైలట్ ప్రాజెక్ట్గా గురుగ్రామ్లో ఎల్పీజీ ఏటీఎంని ప్రారంభించింది. సోహ్నాలోని సెక్టార్ 22లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఈ స్మార్ట్ వెండింగ్ మెషీన్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్.
క్షణాల్లో గ్యాస్ సిలిండర్, 24 గంటలు అందుబాటులో
వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయాలి. అక్కడి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఏదైనా యూపీఐ ఐడీ ద్వారా చెల్లింపులు జరపాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ బయటకు వస్తుంది. వినియోగదారులు తీసుకెళ్లిన ఖాళీ సిలిండర్ లోపలకు వెళ్లిపోతుంది.
ఏటీఎం నుండి వచ్చే సిలిండర్లు సాంప్రదాయ ఇనుప సిలిండర్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఫైబర్తో తయారు చేసినవి కావడంతో తేలికగా ఉంటాయి. సాధారణంగా సిలిండర్లు గ్యాస్తో కలిపి సుమారు 31 కిలోల బరువు ఉంటుంది. కొత్త సిలిండర్ సుమారు 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీనిని ఎత్తడం చాలా సులభం కూడా.
ALSO READ: భారీగా తగ్గనున్న కోడి గుడ్ల ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?
ఎల్పీజీ ఏటీఎం 24 గంటలు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీ డెలివరీ చేసే సిలిండర్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వెళ్లి కేవలం నిమిషాల వ్యవధితో కొత్త సిలిండర్ను తీసుకోవచ్చు. ఏటీఎంల్లో ఒకేసారి 10 సిలిండర్లను నిల్వ చేయవచ్చు. స్టాక్ అయిపోయినప్పుడు గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇస్తుంది.
గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే దిశగా ఇదొక ముందడుగు. సాంకేతికత ద్వారా వినియోగదారులకు వేగంగా సేవలను అందించాలని బీపీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి.