Zero Tax Schemes: 2026-27 బడ్జెట్ లో ట్యాక్స్ స్లాబ్ లను యథావిధిగా కొనసాగించింది కేంద్రం. దీంతో ట్యాక్స్ పేయర్లకు పెద్దగా ఉపశమనం లభించలేదు. అయితే మూడు కేంద్ర పథకాలకు మాత్రం పన్ను మినహాయింపులు కొనసాగించింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఈపీఎఫ్ పథకాలను పన్ను మినహాయింపు వర్గంలోకి వస్తాయి. ఈ మూడు పథకాల్లో పెట్టుబడులకు ఆదాయపు పన్ను, వడ్డీపై పన్నులు, విత్ డ్రాపై పన్నులు ఉండవు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్యాక్స్ మినహాయింపు పథకం. పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడిదారులు ఏడాదికి కనీసం రూ.500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టువచ్చు. పీపీఎఫ్ పెట్టుబడులపై 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏదేళ్లకు ఒకసారి పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ పెట్టుబడులపై రుణం కూడా తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం ఆడపిల్లల కోసం ప్రారంభించింది. ఈ పథకం కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు.. విద్య, వివాహం కోసం పొదుపు చేసుకోవచ్చు. చిన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న స్కీమ్ లలో సుక్య సమృద్ధి యోజన బెస్ట్ స్కీమ్. ఇందులో సంవత్సరానికి కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆడ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడిలో 50 శాతం విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ పెట్టుబడులు, వడ్డీ, విత్ డ్రాలపై ఎలాంటి పన్నులు పడవు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. భారత్ లో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పీఎఫ్ ఖాతాను తెరవాలి. ఉద్యోగి, యజమాని ఇద్దరూ నెలవారీగా పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పొందేందుకు ఈ పథకం బెస్ట్. వివాహం, అనారోగ్యం, ఇతర ఖర్చులకు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ మీరు అదనంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే పెన్షన్ కోసం కూడా దాచుకోవచ్చు. ఈ పెట్టుబడులకు పన్నుల మినహాయింపులు ఉన్నాయి.
Also read: అనవసర ఖర్చులు తగ్గించుకునే 5 పొదుపు చిట్కాలు
బడ్జెట్ 2026 ప్రకారం, సావరీన్ గ్లోడ్ బాండ్లను ఆర్బీఐ నుంచి కొనుగోలు చేసి ఎనిమిది ఏళ్లు మెచ్యూరిటీ వరకు ఉంచితే వీటి మూలధన లాభాల పన్ను నుంచి మినహాయిస్తాయి. ఈ మినహాయింపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అన్ని సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒకే విధంగా వర్తిస్తుంది. అయితే సెకండరీ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు మాత్రం పన్నులు చెల్లించాలి.