రాష్ట్రంలో నిరుద్యోగ యువత పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ.. వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వం షాకిచ్చేలా వ్యవహరిస్తోంది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను దొడ్డిదారిన భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ నియామకాలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని యువత ఆశించింది.. కానీ గత పాలకుల హయాంలోనూ ఒక క్రమపద్ధతి లేని పరీక్షలు, అరకొర నోటిఫికేషన్లతో అన్యాయం జరిగిందని ఆమె గుర్తుచేశారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే తమకు న్యాయం జరుగుతుందని భావించిన యువత, గ్రామాల్లో ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను అయోమయంలో నెట్టేసిందని విమర్శించారు.
గతంలో లక్షన్నర జీతం ఉన్న పోస్టులను ప్రొవిజన్ పేరుతో అక్రమంగా భర్తీ చేసిన ఉదంతాలను, నిర్మల్ జిల్లాలో 44 పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్న ఘటనలను నిరుద్యోగులు కవిత దృష్టికి తీసుకువచ్చారు. అప్పట్లో అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్లో చేరి, ఈ అక్రమ రిక్రూట్మెంట్లకు తెరలేపుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రాన్స్కో, జెన్ కో వంటి శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులను రాజకీయ పైరవీలు, డబ్బుల సంచులతో దక్కించుకునేందుకు కొంతమంది అధికారులు, నాయకులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ అక్రమ మార్గాలను అడ్డుకోకపోతే నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతాయని, ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే నియామకాలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ‘డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందాలని ఎవరూ ప్రయత్నించవద్దు. భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని ఆమె హెచ్చరించారు. మెరిట్ అభ్యర్థుల పక్షాన జాగృతి ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ALSO READ: FSL Fire Accident: ల్యాబ్లో మంటలు.. కేసుల్లో గుబులు.. ఫోన్ టాపింగ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?