Hyderabad crime: నగరంలో మరో నకిలీ వైద్యుడి భాగోతం బయటపడింది. తెల్ల కోటు వేసుకుంటే చాలు డాక్టర్ అని నమ్మే అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా మోసాన్ని బేగంపేట పోలీసులు ఛేదించారు. వైద్య శాస్త్రంపై కనీస అవగాహన, ఎలాంటి అర్హత పత్రాలు లేకపోయినా, క్లినిక్ బోర్డు తగిలించి యథేచ్ఛగా వైద్యం చేస్తున్న వ్యక్తిని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రసూల్పురాలో రెడ్ హ్యాండెడ్గా..
సికింద్రాబాద్ పరిధిలోని రసూల్పురా, ఇందిరమ్మనగర్లో ఈ దారుణం వెలుగు చూసింది. అక్కడ ‘పవన్ సాయి’ పేరుతో ఒక క్లినిక్ నిర్వహిస్తూ, స్థానికులకు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నట్లు నమ్మబలికాడు చేగు సుబ్రమణ్యం(55). అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన బేగంపేట ఎస్సై శ్రావణ్ కుమార్ తన బృందంతో కలిసి క్లినిక్పై మెరుపు దాడి చేశారు. ఆ సమయంలో రోగులకు వైద్యం అందిస్తున్న సుబ్రమణ్యం పోలీసులను చూసి అవాక్కయ్యాడు.
అర్హత అడిగితే తెల్లమొహం!
పోలీసులు క్లినిక్ రికార్డులను, సుబ్రమణ్యం వైద్య వృత్తికి సంబంధించిన డిగ్రీ పట్టాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. వైద్యం చేసేందుకు ఉండాల్సిన ఎలాంటి కనీస ధ్రువపత్రాలు అతని వద్ద లేవు. వైద్య విద్య అంటే ఏమిటో కూడా తెలియని ఈ వ్యక్తి, కేవలం అనుభవం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. డాక్టర్ కాకపోయినా డాక్టర్ అని నమ్మించి అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా, వారి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాడని పోలీసులు నిర్ధారించి అతడిని అరెస్ట్ చేశారు.
జాగ్రత్త.. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి!
ఈ తరహా ఘటనలు సామాన్య ప్రజలకు ఒక హెచ్చరిక. రంగురంగుల బోర్డులు, ఆకర్షణీయమైన క్లినిక్లను చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల దగ్గరకు లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని, నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిపై కఠిన కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇలాంటి నకిలీ క్లినిక్లు ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: వ్యూహం ఫలించింది.. 15వ నౌక సేఫ్.. భారత్కు ఇక ఇంధన కష్టాలు తీరినట్టే?