Wildlife Hunting: వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు సభ్యుల గ్యాంగును గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు ఎయిర్ గన్లు, ఓ లైసెన్స్ డ్ రైఫిల్, 20 బుల్లెట్లు, స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పాతబస్తీ అలీజాకోట్లకు చెందిన మహ్మద్ ముజఫర్ హుస్సేన్ అలియాస్ గుడ్డు (42) పక్షుల వ్యాపారి. జడ్చర్లలో ఉంటూ చదువుకుంటున్న మీర్ అహ్మద్ అమీర్ (27), అలీజాకోట్లలో ఆప్టికల్స్ షాప్ నడుపుతున్న అబ్దుల్లా బిన్ సహైన్ (27), మొఘల్ పురాకు చెందిన సౌద్ బిన్ మహ్మద్ బలాబ్ (41), ర్యాపిడో డ్రైవర్ మసూద్ బిన్ మహ్మద్ (43), మక్తల్ ప్రాంతంలోని ముస్తిపల్లికి చెందిన శేఖర్ (38)తో అతనికి పరిచయాలు ఉన్నాయి. నిందితుల్లో ఒకరైన మీర్ అహ్మద్ అమీర్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ లో షూటర్ గా ఉన్నారు.
కాగా, వీళ్లందరికీ వన్యప్రాణులను వేటాడటం సరదా అని తెలుస్తోంది. శేఖర్ ద్వారా షాద్ నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వన్యప్రాణులు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుని స్కార్పియో కారులో అక్కడికి వెళ్లేవారని సమాచారం. ఆ తరువాత జాతీయ పక్షి అయిన నెమలితోపాటు జింకలను పదుల సంఖ్యలో వేటాడి చంపినట్లు పోలీసులు గుర్తించారు. వాటి మాంసాన్ని వండుకుని తిన్నట్లు కనుగొన్నారు. వేటాడిన జంతువుల చర్మం, తలలు, ఇతర అవశేషాలను జూరాల బ్యాక్ వాటర్స్ కాలువలో నిందితులు పడేసినట్లు సమాచారం.
Also Read: కంటికి కనిపించని ఏసీ.. కూలింగ్ మాత్రం అదిరిపోద్ది.. నిజంగా అద్భుతం భయ్యా!
ఈ గ్యాంగ్ గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్.. ఎస్ఐ వెంకటరమణతోపాటు సిబ్బందితో కలిసి నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను అటవీ శాఖ ఈస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు.
Also Read: మక్కికి మక్కీ.. తండ్రిని కాపీ..! కవిత రాజకీయం కూడా మోతె గ్రామంతో మొదలు..