Hayathnagar Incident: హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య అనే యువ విద్యార్థిని మృతి చెందింది. అయితే ఐశ్వర్య తన తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు తండ్రీ కూతుళ్లిద్దరూ రోడ్డుపై దూరంగా ఎగిరిపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, వాహనం డ్రైవర్ ఆగకుండా సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి, తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న తండ్రీ కూతుళ్లను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, అప్పటికే ఐశ్వర్య ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో ఆసుపత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని అకాల మరణం పట్ల సహచర విద్యార్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలవడంతో, మెరుగైన చికిత్స కోసం ఆయనను నగరంలోని మరో ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
Also Read: ప్రమాదకర స్థాయిలో పొగమంచు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలు..
ఘటన గురించి సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పరారీలో ఉన్న వాహనాన్ని, డ్రైవర్ను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఘటన
ప్రమాదంలో మెడికో ఐశ్వర్య మృతి, ఆమె తండ్రికి తీవ్ర గాయాలు pic.twitter.com/anvvqQFQ3K
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2025