NIT Professor Suicide: హనుమకొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మసాగర్ చెరువులో దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి గత కొద్ది రోజులుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన, డ్యూటీ కోసం క్యాంపస్కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే నిట్కు వెళ్లకుండా నేరుగా ధర్మసాగర్ చెరువు వద్దకు చేరుకున్నారని సమాచారం.
ఉదయం సమయంలో చెరువు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న స్థానికులు.. చెరువు ఒడ్డున ఓ బైక్ అనుమానాస్పదంగా నిలిపి ఉండడాన్ని గమనించారు. బైక్ నెంబర్ ఆధారంగా విచారించగా అది నిట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వాహనమని గుర్తించారు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని సహోద్యోగులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ధర్మసాగర్ చెరువు వద్దకు చేరుకుని.. గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం చెరువులో ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుని భార్య వసుంధర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Also Read: హైదరాబాద్లో దారుణం.. ఏడేళ్ల బాలుడికి అడ్లకాడతో వాతలు పెట్టిన టీచర్
వెంకట సుబ్బారెడ్డి కొంతకాలంగా మానసిక వ్యాధితో నిద్రపట్టకపోవడంతో.. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిద్ర కోసం మాత్రలు కూడా వాడుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు.