Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఆ లక్ష్య సాధనకు చేరువవ్వాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాద్రోహ పాలనపై పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పరిధిలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఏ రాజకీయ పార్టీ కూడా బీజేపీతో పోటీ పడలేదు..
పార్టీ సంస్థాగత బలోపేతానికి, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ జిల్లా, డివిజన్ స్థాయి కార్యవర్గ సమావేశాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా సంస్థాగతంగా బీజేపీతో పోటీ పడలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 35,000 పోలింగ్ బూత్లలో, దాదాపు 31,000 బూత్లలో పూర్తి స్థాయి బూత్ కమిటీలను కలిగి ఉన్నామన్నారు. పార్టీకి 42 లక్షల పైగా సభ్యత్వం ఉందని, 920 మండలాలకు గాను 870 మండలాల్లో బలమైన యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో పార్టీకి కొంత వెనుకబాటు ఉన్న కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాలతో పాటు, పాతబస్తీ(ఓల్డ్ సిటీ) ఏరియాల్లో కూడా మైనారిటీలు పెద్ద సంఖ్యలో బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు..
ఈ బలమైన సంస్థాగత స్వరూపాన్ని రాబోయే రోజుల్లో రాజకీయ విజయాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనబెట్టాయని రాంచందర్ రావు విమర్శించారు. కేవలం తమ కుటుంబాలు, తమకు కావాల్సిన వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ రెండు పార్టీలు పరితపించాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతపై బీజేపీ నిరంతరం పోరాడి ప్రజలను సిద్ధం చేస్తే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని అబద్ధపు వాగ్దానాలు, గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు నిరుద్యోగుల గొంతు నొక్కాయని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు ఎంతమాత్రం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు..
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సభ పూర్తిగా ఫ్లాప్ అయిందని, అందులో అంతా వృద్ధులే కనిపించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పారని, 10 ఏళ్ల పాలనలో గ్రూప్-1 లాంటి కీలక పరీక్షల పేపర్లను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకంటే దారుణంగా వ్యవహరిస్తోందని, కేవలం తమ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు, అనుచరులకు పదవులు, ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారే తప్ప రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాంచందర్ రావు ఆరోపణలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా కానిస్టేబుల్ పోస్టులు మినహా మరే ఇతర పెద్ద నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇకపోతే కాంగ్రెస్.. గ్రేటర్ హైదరాబాద్ ను విభజించి.. మజ్లిస్కు కాంగ్రెస్ గిఫ్ట్ ఇచ్చిందని రాంచందర్ రావు ఆరోపించారు. హైడ్రా.. హైదరాబాద్ ప్రగతికి విఘాతంగా మారిందన్నారు. ప్రజలు బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు మరింత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా స్థానిక ప్రజా సమస్యలపై, రోడ్ల దుస్థితిపై, అధికార యంత్రాంగం, ప్రభుత్వ వైఫల్యాలపై రోడ్ల మీదకు వచ్చి ఉధృత పోరాటాలు చేయాలని జిల్లా అధ్యక్షుడిని, శ్రేణులకు సూచించారు. ఈ కార్యవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
Also Read: కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్షీట్లో సంచలన నిజాలు!