Bandi Sanjay: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశాలపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ కు బండి సంజయ్ ఆదివారం లేఖ రాశారు. నిర్దేశిత లక్ష్యాలకు విరుద్దంగా ఆర్ధిక సంఘం నిధులను ఖర్చు చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయడం లేదని, కరెంట్ బిల్లులు, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలకు నిధులను మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ల పాత బకాయిలను కూడా ఈ నిధుల నుంచే చెల్లిస్తున్నారని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243జీ అధికరణం, 11వ షెడ్యూల్, అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఇది విరుద్ధమన్నారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం రూ.2,293.74 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసిందని, మరో రూ.729.41 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వడం లేదని బండి లేఖలో ప్రస్తావించారు. ఆర్థిక సంఘం నిధులు కూడా దారి మళ్లించాలని సర్పంచులపైన రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తెస్తుండటం ఆందోళనకరమని వెల్లడించారు.
Also read: Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!
లిఖితపూర్వక ఉత్తర్వులివ్వకుండా మౌఖిక ఆదేశాలతో సర్పంచులు, కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ది పూర్తిగా కుంటుపడుతోందని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. నిర్దేశిత లక్ష్యాలకే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. తెలంగాణకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
Also read: Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!