Andhra Pradesh: తిరుపతిలోని ప్రతిష్టాత్మక నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విజ్ఞానం బోధించాల్సిన స్థానంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేసిన అకృత్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఒరిస్సాకు చెందిన ఒక ఫస్ట్ ఇయర్ బీఈడీ విద్యార్థినిని లక్ష్యంగా చేసుకొని, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా, ఆమె గర్భం దాల్చడానికి కారణమైనట్లు ఫిర్యాదు చేశారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసరే కీచకపర్వానికి పాల్పడటం యూనివర్సిటీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అయితే ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనకు మరొక ప్రొఫెసర్ కూడా సహకరించడం. నిందితుడు లక్ష్మణ్ కుమార్తో విద్యార్థిని ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రహస్యంగా వీడియో రికార్డు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శేఖర్ రెడ్డి ఈ వీడియోను అడ్డుపెట్టుకుని, బాధిత విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి, ఆమెను లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కీచకపర్వాన్ని భరించలేకపోయిన బాధిత విద్యార్థిని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వి.సి. తక్షణమే స్పందించి, ప్రధాన నిందితుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన యూనివర్సిటీలో పెద్ద దుమారం రేపడంతో, మిగిలిన సిబ్బంది నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, మొదట్లో పోలీసులు బాధిత విద్యార్థిని స్వయంగా ఫిర్యాదు చేయాలని సూచించడంతో కొంత జాప్యం జరిగింది.
అనంతరం, యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వి.సి. రజనీకాంత్ శుక్లా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా, ఇద్దరు నిందితుల సెల్ఫోన్లను సీజ్ చేసి, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
Also Read: కాంగ్రెస్ 420 హామీలు ఫెయిల్.. టీబీజేపీ మహాధర్నాలో నేతల ఆగ్రహం
అంతేకాకుండా, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అధికారులు ఐసీసీని కూడా నియమించారు. తనపై జరిగిన ఘాతుకం, వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్థిని, ప్రస్తుతం తన స్వస్థలమైన ఒడిస్సాకు వెళ్లిపోయినట్లు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.