IndiGo Announcement: విమానాల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 10 నాటికి విమానాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొంది. వరుసగా ఆరో రోజు కూడా ఇండిగో విమానాల అంతరాయం కొనసాగుతోంది. నేడు మొత్తం 650 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇండిగో సాధారణంగా రోజువారీగా 2,300 విమానాలు నడుపుతుండేది. అయితే ఇవాళ 650 విమానాలు రద్దు చేసింది. ఇంకా 1,650 విమానాలు నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఇవాళ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 115 విమానాలు, ముంబై విమానాశ్రయంలో 112, దిల్లీలో 109, చెన్నైలో 38, అమృత్సర్లో 11 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. మంగళవారం నుంచి ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 2,000కి పైగా విమానాలను రద్దు అయ్యాయి. పైలట్లకు వారాంతపు విశ్రాంతి నిబంధన అమలు చేయడంతో ఇండిగోలో సంక్షోభం మొదలైంది. దీంతో వందల సంఖ్యలో విమానాలు రద్దు చేసింది, అనేక ఇతర విమానాలను ఆలస్యం చేసింది. దీంతో ఎప్పుడూ చూడని విధంగా ఎయిర్ పోర్టులు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు.
ఇండిగో విమాన అంతరాయం దేశంలోనే అత్యంత దారుణమైన విమానాయాన సంక్షోభంగా మారింది. దీంతో ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమానాల రద్దుతో ప్రయాణికులకు రీఫండ్ ను డిసెంబర్ 7 (ఆదివారం) రాత్రి 8 గంటలలోపు క్లియర్ చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం ఇండిగోను ఆదేశించింది. విమాన ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని దేశీయ విమానాల ఛార్జీలపై పరిమితులను విధించింది.
విమానాల క్రమబద్దీకరణపై ఇండిగో తాజాగా ప్రకటన చేసింది. డిసెంబర్ 10 నాటికి తమ కార్యకలాపాలు పునరుద్ధరిస్తామని ఎయిర్లైన్ తెలిపింది. ఈ సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి ఇండిగో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనదంతా చేస్తున్నామని పేర్కొంది. అయితే డీజీసీఏ జారీ చేసిన నోటీసులో ఇండిగో ప్రణాళిక, పర్యవేక్షణ వనరుల నిర్వహణలో విఫలమైందని, ఇందుకు ఇండిగో సీఈవోను బాధ్యులుగా పేర్కొంది. ఆయన ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలిపాలని 24 గంటల సమయం ఇచ్చింది.
Also Read: Goa Night Club Fire: గోవా నైట్ క్లబ్ ఘటనలో.. షాకింగ్ విషయాలు, నిప్పు మొదలైన వీడియో ఇదిగో
ఇండిగో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల రీఫండ్ లను ఆదివారం రాత్రిలోగా క్లియర్ చేయాలని ఇండిగో సంస్థను డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికుల లగేజీని రెండ్రోజుల్లో తిరిగి అప్పగించాలని సూచించింది. శనివారం 1,500 విమానాలను నడిపినట్లు ఇండిగో తెలిపింది. 95 శాతానికి పైగా నెట్వర్క్ కనెక్టివిటీ ఇప్పటికే పునరుద్ధరించామని పేర్కొంది. మరోసారి అంతరాయాలకు క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది.