BigTV English

Sathya Sai Baba : మన కాలపు ప్రేమస్వరూపుడు.. సత్యసాయి బాబా

Sathya Sai Baba : మన కాలపు ప్రేమస్వరూపుడు.. సత్యసాయి బాబా
Sathya Sai Baba

Sathya Sai Baba : ‘అందరినీ ప్రేమించండి… ఆ ప్రేమను మరింతగా పంచండి’ అనే మాటతో ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని ఇచ్చిన పుట్టపర్తి సత్య సాయిబాబా వారి జయంతి నేడు. సమాజం నీకేమిచ్చింది అనేది పక్కనబెట్టి… నువ్వు సమాజానికి ఏమిచ్చావు అని ప్రశ్నించుకోవటంలోనే దైవత్యం ఉందనే తత్త్వాన్ని నమ్మి, ఆచరించి, బోధించిన బాబా.. తన జీవిత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని సేవామార్గంలో నడిపారు.


సత్య, ధర్మ, శాంతి, అహింసలతో భక్తిని, సేవను అనుసంధానం చేసి… సమస్త మానవాళినీ తరింపజేయడానికి అవతరించిన సమకాలీన అవతారమే భగవాన్ సత్యసాయి. అందుకే ఆయన నడయాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైంది. 1926 నవంబర్‌లో 23న బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకున్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు.

1940లో మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమరాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో స్పృహను కోల్పోయిన బాబా.. కొద్దిసేపటికి కోలుకున్నారు. ఆనాటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పులొచ్చాయి. తనలో తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారిపోయేవారు. ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాలుని పరిస్థితిని చూసిన వైద్యులు హిస్టేరియాగా నిర్ధారించారు.


దీంతో చేసేది లేక తల్లిదండ్రులు ఆ బాలుడిని తీసుకుని పుట్టపర్తికి తిరిగొచ్చారు. అయితే.. అదే ఏడాది మే 23న ఆ బాలుడి ఓ చర్య.. ఆయనలోని అద్వితీయ శక్తిని వెల్లడించింది. ఆ రోజున బాలుడికి దెయ్యం పట్టిందని భావించిన తండ్రి.. ఓ కర్ర తీసుకుని రెండు దెబ్బలు వేసి ‘ నీవెవరు’ అని అడగ్గా.. తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అనీ, తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. 14 ఏళ్లకే ఆధ్యాత్మిక మార్గం పట్టారు.

తన 18 ఏట.. 1944లో భక్తులు పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. 1950 నాటికి అదే ప్రశాంతి నిలయంగా మారింది. 1954లో ఇక్కడ ఓ చిన్న ఆసుపత్రి కూడా వచ్చింది. 1957లో బాబా ఉత్తరాది పుణ్యక్షేత్రాల సందర్శన చేపట్టారు. 1968 జూన్ 29న బాబా ఉగాండా, నైరోబీ దేశాల్లో పర్యటించి తాను ఏ మతానికీ చెందిన వాడిని కాదనీ, ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు.

1973లో హైదరాబాద్‌లో శివం టెంపుల్, 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమలో తాగునీటి సౌకర్యాల కోసం పనులు చేపట్టి గొంతెండిన పల్లెలకు జలదానం చేశారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి పేదలకు ఉచిత సేవలు అందించటం మొదలుపెట్టారు. తాను దేహం కలవాడిని కాదని, దేహిని అని చెప్పారు. భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణమనీ, పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదని, మరణించేలోపు సేవతో పరమాత్మకు ప్రీతిపాత్రులు కావాలని సూచించారు. 2011 ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు బాబా మహానిర్యాణం చెందారు.

మనలోని దివ్యత్వాన్ని అనుభూతి పొందాలంటే… సకల జీవరాశిపై ప్రేమను చూపాలి అని చెప్పిన బాబా.. ‘మీ రోజువారీ కార్యకలాపాల్ని ప్రేమతో ప్రారంభించి, ప్రేమతో నింపి, ప్రేమతోనే ముగించండి’ అని సందేశమిచ్చారు. మానవతా విలువలైన సత్యం , ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలతో జనులు సుఖ శాంతులు పొంది తరించాలనీ భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా వారు దివ్య ఆశీస్సులందించుట మానవాళి అదృష్టం. సదాశయములతో సాయిబాటలో పయనిద్దాం. ధన్య జీవులవుదాం.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×