Train Accident: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లిన ఘటనలో 11 మంది మరణించగా, ఇద్దరు గాయపడ్డారని చైనా మీడియా తెలిపింది. యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్లోని లుయోయాంగ్జెన్ స్టేషన్ వద్ద గురువారం తెల్లవారుజామున భూకంప సంబంధిత పరీక్షలు చేస్తున్న రైల్వే కార్మికులను రైలు ఢీకొట్టింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక బృందాలను పంపి చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులతో కలిసి గాయపడిన వారికి వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. సహాయక చర్యలు అనంతరం లుయోయాంగ్జెన్ స్టేషన్లో రైలు కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి.
ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లలో ఒకటైన చైనాలో ఇటీవలి కాలంలో అనేక ఘోర రైలు ప్రమాదాలు సంభవించాయి. 2022లో గుయిజౌ ప్రావిన్స్ రోంగ్జియాంగ్ కౌంటీ సమీపంలో కొండచరియలు ట్రాక్ పై పడడంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకోపైలెట్ మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Also Read: Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య
2020లో హునాన్ సెంట్రల్ ప్రావిన్స్లోని చెంజౌలో రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఒకరు మరణించగా, 127 మంది గాయపడ్డారు. 2011లో జెజియాంగ్ ప్రావిన్స్లోని వెంజౌలో హై స్పీడ్ రైలు ఆగి ఉన్న లోకోమోటివ్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతి చెందగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. 2008లో తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ జిబో సమీపంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొని దాదాపు 66 మంది మరణించారు.