Modi – Trump : ట్రంప్ తింగరోడు, మెంటలోడు అని కొందరు అంటుంటారు. ఎవరేమన్నా ఆయన డోంట్ కేర్. తాను చేయాల్సింది చేసుకుపోతారు. తాను చెప్పాల్సింది చెప్పేస్తుంటారు. మోదీ తన ఫ్రెండ్ అంటూ ఆకాశానికెత్తేస్తారు. అంతలోనే ఐ లవ్ పాకిస్తాన్ అని మన దాయాది దేశాన్నీ పొగిడేస్తారు. ఎవరితో అవసరం ఉంటే వారితో అలా ఉంటారు. రష్యా, ఉత్తర కొరియాలతో కూడా దోస్తానా చేసేంత కిలాడీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. మస్క్ను నెత్తికి ఎక్కించుకున్నది ఆయనే.. అదే మస్క్ను నేలకేసి కొట్టిందీ ఆయనే. అట్లుంటది మరి ట్రంప్తోని. ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనంటూ పదే పదే చెప్పారు. అణుయుద్ధం ఆపినందుకు తనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామాకు ఇచ్చారు తనకు ఎందుకు ఇవ్వరనేది ట్రంప్ లాజిక్ క్వశ్చన్. లేటేస్ట్గా పాక్ ఆర్మీ చీఫ్కు సైతం వైట్ హౌజ్లో డిన్నర్ ఇచ్చి దారికి తెచ్చుకున్నారు. ఇరాన్తో యుద్ధమే చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ భూభాగాన్ని విచ్చలవిడిగా వాడేసుకోవడానికే ఆ విందు రాజకీయం అని అంటున్నారు. పనిలో పనిగా తన కుటుంబ సభ్యుల క్రిప్టో వ్యాపారంలోనూ పాక్తో డీల్ కుదుర్చుకున్నారు. ఫక్తు బిజినెస్మేన్ అండ్ పొలిటిషియన్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా దానికో లెక్కుంటుంది.
నిజం చెప్పేసిన ట్రంప్
ఇక, భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కారకుడిని తానేనంటూ కొంత కాలంగా చెప్పుకొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా నిజం మాట్లాడారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు విందు ఇచ్చిన అనంతరం కీలక కామెంట్స్ చేశారు. ఇద్దరు స్మార్ట్ లీడర్స్ మోదీ, షెహబాజ్ షరీఫ్లు కలిసి తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఉద్రిక్తతలు చల్లారాయని చెప్పారు.
పెహల్గామ్ అటాక్ అనంతర పరిణమాల్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. దాయాది దేశంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. టెర్రరిస్టులకు మద్దతుగా ముందుకొచ్చిన పాకిస్తాన్ సైన్యాలను మట్టి కరిపించాయి భారత త్రివిధ దళాలు. చివరకు విధి లేని పరిస్థితుల్లో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది పాకిస్తాన్.
లేట్గానైనా లేటెస్ట్గా..
సరిగ్గా ఈ సమయంలో ఎంటరైంది అమెరికా. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందానికి కారణం తానేనంటూ చెప్పుకొచ్చారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు.. ఆ తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ ఇదే మాట చెప్పడం ప్రారంభించారాయన. చివరకు భారత్-పాకిస్తాన్ మాదిరిగానే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చల్లారేలా చేస్తానని ప్రకటించారు. అయితే.. లేటెస్ట్గా ఇదే అంశంపై జీ7 సదస్సు వేదికగా ప్రెసిడెంట్ ట్రంప్నకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో ఇతరుల పాత్ర లేదన్నారు. వేరే దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పారు మోడీ. భారత ప్రధాని కామెంట్లపై.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొన్న వేళ ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఓవల్ ఆఫీసులో స్పష్టమైన ప్రకటన చేశారు ట్రంప్. ఇద్దరు స్మార్ట్ లీడర్లు కలిసి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం వల్లే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్.