ఇండోనేషియాలోని అచీ ప్రావిన్స్లో షరియా నిబంధనలను ఉల్లంఘించిన ఒక జంటకు అక్కడి అధికారులు అత్యంత కఠినమైన శిక్షను అమలు చేశారు. వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో పాటు మద్యం సేవించినందుకు గాను ఒక పురుషుడు, ఒక స్త్రీకి బహిరంగంగా 140 చొప్పున కొరడా దెబ్బల శిక్షను విధించారు. వందలాది మంది ప్రజలు చూస్తుండగానే ఒక పబ్లిక్ పార్కులో రతన్ కర్రలతో వారి వీపులపై ఈ శిక్షను అమలు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ నొప్పిని భరించలేక స్పృహతప్పి పడిపోవడంతో అధికారులు ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
అచీ ప్రావిన్స్ షరియా పోలీస్ హెడ్ ముహమ్మద్ రిజాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు జంటకు లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు 100 దెబ్బలు, మద్యం సేవించినందుకు మరో 40 దెబ్బలు కలిపి మొత్తం 140 కొరడా దెబ్బలను శిక్షగా ఖరారు చేశారు. 2001లో అచీ ప్రావిన్స్కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి లభించిన తర్వాత అమలులోకి వచ్చిన షరియా చట్టాల్లో భాగంగా, ఇప్పటివరకు విధించిన అత్యంత కఠినమైన శిక్షలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో, షరియా చట్టాలను అమలు చేసే ఏకైక ప్రాంతం అచీ మాత్రమే.
అదే రోజు మొత్తం ఆరుగురికి కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. ఆశ్చర్యకరంగా, వీరిలో ఒక షరియా పోలీసు అధికారి, అతని భార్య కూడా ఉన్నారు. ఒక ప్రైవేట్ ప్లేస్ లో సన్నిహితంగా ఉంటూ పట్టుబడినందుకు ఆ అధికారికి, అతని భాగస్వామికి తలో 23 దెబ్బల శిక్షను వేశారు. ‘మేము ఎవరికీ మినహాయింపులు ఇవ్వము. మా శాఖకు చెందిన వారైనా సరే చట్టం ముందు సమానమే. ఇటువంటి చర్యలు మా ప్రతిష్టను దెబ్బతీస్తాయి’ అని ముహమ్మద్ రిజాల్ స్పష్టం చేశారు.
అచీ ప్రావిన్స్లో జూదం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందే శారీరక సంబంధాలు కలిగి ఉండటం వంటి పనులను నేరాలుగా పరిగణిస్తారు. గతంలో 2025లో కూడా ఇద్దరు పురుషులకు స్వలింగ సంపర్కం నేరం కింద 76 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు.
అయితే, ఈ బహిరంగ శిక్షా విధానంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇవి అమానవీయమని విమర్శిస్తున్నప్పటికీ, తమ ప్రావిన్స్కు ఉన్న ప్రత్యేక స్వయంప్రతిపత్తి అధికారాల ప్రకారం ఈ చట్టాలు చెల్లుబాటు అవుతాయని ఇండోనేషియా అధికారులు సమర్థించుకుంటున్నారు.
ALSO READ: Arava Sridhar: అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ