Iran Airport Blast: ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోమారు విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో టెహ్రాన్ లోని అత్యంత రద్దీగా ఉండే మెహ్రాబాద్ విమానాశ్రయంలో భారీ పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలో ఉంది. ఈ మెహ్రాబాద్ విమానాశ్రయం ఉంది. నగరం వెలుపల ఉన్న ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయానికి భిన్నంగా ఇది దేశీయ విమానాలను మాత్రమే రన్ చేస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో విమానశ్రయంలోని రెండు విమానాలు దగ్దమయ్యాయి.
🚨BREAKING: MEHRABAD AIRPORT IN TEHRAN BOMBED JUST NOW
— Spencer Hakimian (@SpencerHakimian) March 6, 2026
ఇరాన్ తో పాటు దాని మిత్ర దేశమైన లెబనాన్ పైనా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఇప్పటివరకు ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకలు, అతి కీలకమైన ప్రభుత్వ భవనాలను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్.. ఇప్పుడు నేరుగా విమానాశ్రయంపై దాడికి తెగబడటం అందరినీ షాక్ కు గురిచేసింది. యుద్ధం మరింతగా విస్తరిస్తుందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విమానాశ్రయంపై దాడికి కొద్దిసేపటి ముందే ఇజ్రాయెల్ దళాలు.. లెబనాన్ లోని బీరుట్ నగరాన్ని టార్గెట్ చేశాయి. డ్రోన్, క్షిపణి దాడులతో నగరంలోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ లోని అతి ముఖ్యమైన విమానశ్రయాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం గమనార్హం. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం బేషరతుగా లొంగకుండా.. శాంతి ఒప్పందం కుదరదని శుక్రవారం డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.
మరోవైపు యుద్ధంలో మరణించిన ఆరుగురు అమెరికన్ సైనికుల మృతదేహాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాళులు అర్పించనున్నారు. శనివారం డెలావేర్ లోని డోవర్ వైమానిక దళ స్థావరంలో జరిగే ఈ సైనిక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఆదివారం కువైట్ లోని షోర్ట్ షుయిబా వద్ద ఉన్న అమెరికా వ్యూహాత్మక కమాండ్ సెంటర్ ను ఇరానియన్ డ్రోన్లు ఢీకొట్టి పేల్చివేశాయి. ఈ ఘటనలో యూఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Hyderabad: లిక్కర్ షాక్.. మూత తీయగానే బీర్ బాటిల్లో కదులుతున్న చేపపిల్ల.. వీడియో వైరల్