Iran Drone Attacks: అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో వాషింగ్టన్ లోని అత్యంత కీలకమైన ఫోర్ట్ మెక్నాయర్ సైనిక స్థావరంపై గుర్తుతెలియని డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.. విదేశాంగ మంత్రి మార్కో రుబియో లక్ష్యంగా ఇరాన్ ఈ స్కెచ్ వేసినట్లుగా సమాచారం. వీరిద్దరి నివాసాలు అదే సైనిక స్థావరంలో ఉండటంతో వైట్ హౌస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతా అధికారులు ఇద్దరు మంత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గత పది రోజులుగా ఫోర్ట్ మెక్నాయర్ పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ల సంచారం పెరిగిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక భద్రతాధికారి అలీ లారిజాని.. నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించడంతో దానికి బదులుగా ఇరాన్ అమెరికాలోని అగ్రనేతలను టార్గెట్ చేసే అవకాశం ఉందని నివేదికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షణ.. విదేశాంగ మంత్రులను డ్రోన్ అటాక్స్తో హతమార్చేందుకు ఇరాన్ వ్యూహాలు పన్నుతోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై పెంటగాన్ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించినప్పటికీ.. వైట్ హౌస్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించి సైన్యాన్ని హై అలర్ట్ చేశారు.
సైనిక స్థావరంలోకి డ్రోన్లు చొచ్చుకురావడం అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలుగా మారింది. విదేశాల్లోని తమ దౌత్య కార్యాలయాలకు సైతం భద్రతా హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. స్వదేశంలోని అన్ని సైనిక స్థావరాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసింది. డ్రోన్లు ఎక్కడి నుండి వచ్చాయనే అంశంపై స్పష్టత లేనప్పటికీ.. ఇరాన్ ప్రమేయంపైనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మంత్రులను సేఫ్ ప్లేస్కు తరలించే ప్రక్రియపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వారు అక్కడే ఉన్నా.. ఎప్పుడైనా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్రోన్ అటాక్స్ ద్వారా భౌతిక దాడులకు పాల్పడటం లేదా నిఘా పెట్టడం వంటి చర్యలకు ఇరాన్ పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అగ్రరాజ్యం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా గడ్డపైనే మంత్రులకు రక్షణ కరువైందనే వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.