Humanity Decline: నేటి సమాజంలో మానవత్వం రోజు రోజుకి మంటగలిసిపోతుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని కాపాడాల్సింది పోయి తమ లాభం చూసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి విచారకరమైన ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా బుజబుజ్జ జాతీయ రహదారిపై సాఫ్ట్ డ్రింక్స్ లోడ్తో వెళ్తున్న ఒక భారీ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి లారీలోని కూల్ డ్రింక్ బాటిళ్లు రోడ్డంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బాటిళ్లు పగిలిపోగా, మరికొన్ని రోడ్డుపై కుప్పలుగా పడ్డాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, బాటసారులు డ్రైవర్ పరిస్థితిని గమనించడం మాని.. బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పది నిమిషాల వ్యవధిలోనే లోడ్ అంతా ఖాళీ చేసేశారు. దొరికినకాడికి దొరికినట్లుగా ప్రజలు బాటిళ్లను సంచుల్లో నింపుకుని తీసుకెళ్లారు. జనం గుంపులుగా చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డుపై ఉన్న గాజు పెంకులను , వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. డ్రైవర్ను కాపాడటం కంటే ఉచితంగా వచ్చే వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవత్వం రోజురోజుకీ మంటగలిసిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
Also Read: భలే ఆఫర్.. రూ.25కే లీటర్ చెరకు రసం, ఎక్కడో కాదు హైదరాబాద్లోనే!
నెల్లూరులో కూల్డ్రింక్స్ లారీ బోల్తా.. ఎగబడిన స్థానికులు
నెల్లూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూల్డ్రింక్స్ తరలిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలోని కూల్డ్రింక్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. pic.twitter.com/mj57IF7My8
— ChotaNews App (@ChotaNewsApp) March 19, 2026