Iranian Drone Strike AWS Bahrain: అమెరికా టెక్ సంస్థలు తమ సైనిక, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాయని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ కాలమానం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటలకు తరువాత అమెరికా టెక్ సంస్థలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఇందులో భాగంగా బహ్రెయిన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడి జరిపింది. . ఈ దాడిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్(AWS) సౌకర్యాలు దెబ్బతిన్నట్లు BRICS న్యూస్ నివేదించింది. అంతకుముందు మార్చి 2026లో కూడా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని రెండు ఏడబ్ల్యూఎస్ కేంద్రాలను నేరుగా తాకగా, బహ్రెయిన్లోని ఒక కేంద్రం సమీపంలో జరిగిన పేలుడు వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన ఈ దాడుల వల్ల AWS మౌలిక సదుపాయాలకు నిర్మాణాత్మక నష్టం వాటిల్లడమే కాకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీని ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలోని బ్యాంకింగ్ వ్యవస్థలు, మొబైల్ యాప్లు, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. క్లౌడ్ నెట్వర్క్లపై ఆధారపడిన అనేక వ్యాపారాలు, ప్రభుత్వ కార్యకలాపాలు ఈ సేవల నిలిపివేత వల్ల ప్రభావితమయ్యాయి.
కేవలం శత్రు దేశాలకు చెందిన సైనిక స్థావరాలనే కాకుండా, క్లౌడ్ నెట్వర్క్లను నడిపించే డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం ఆధునిక యుద్ధతంత్రంలో ఒక కొత్త కోణాన్ని వెల్లడిస్తోంది. అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల మౌలిక సదుపాయాలపై జరిగిన ఈ దాడులు, ప్రపంచ క్లౌడ్ నెట్వర్క్లు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఎంతటి ప్రమాదంలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఇరాన్ మరిన్ని అమెరికన్ టెక్ సంస్థల యూనిట్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ మౌలిక సదుపాయాలకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
Read Also: ఆటో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన పౌర సరఫరాల శాఖ