Pakistan Blast: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. అశాంతికి నిలయంగా మారిన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. బన్ను జిల్లాలోని మాలిఖేల్ (ఫతా ఖేల్) ప్రాంతంలో ఉన్న భద్రతా దళాల చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ ఘటనలో 12 మంది భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
విస్ఫోటనానికి బాంబు కారు వినియోగం
ఈ దాడి అత్యంత వ్యూహాత్మకంగా జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారును భద్రతా దళాల పోస్టు గోడకు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు తీవ్రతకు చెక్పోస్టు గోడలు కూలిపోయి భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ పెను ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి సైన్యం.. ఆరుగురు ఉగ్రవాదుల హతం
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. చెక్పోస్టుపై దాడి చేసిన తర్వాత తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులతో భద్రతా దళాలకు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం (ISPR) అధికారికంగా ప్రకటించింది. చుట్టుపక్కల అడవుల్లో మరికొందరు ముష్కరులు దాగి ఉండవచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలను (Clearance Operations) ముమ్మరం చేశారు.
Also Read: పటాన్చెరులో ఒక్కసారిగా పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడ్డ మంటలు!
తీవ్రమవుతున్న ఉగ్రవాద ముప్పు
గత కొంతకాలంగా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘హాఫీజ్ గుల్ బహదూర్’ అనే ఉగ్రవాద ముఠా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన భద్రతా బలగాలే లక్ష్యంగా నిరంతరం దాడులు జరుగుతుండటం పాక్ పాలకులకు పెద్ద సవాలుగా మారింది. వరుసగా జరుగుతున్న ఈ ఆత్మాహుతి దాడులు సరిహద్దు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
పాక్లో బాంబ్ బ్లాస్ట్.. 12 మంది పోలీసుల మృతి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. బన్ను జిల్లాలోని ఫతా ఖేల్ సెక్యూరిటీ పోస్ట్పై బాంబులతో నిండిన కారుతో మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు దుర్మరణం… pic.twitter.com/VvT4x5E461
— ChotaNews App (@ChotaNewsApp) May 10, 2026