Trump Warning: ఇరాన్పై వైమానిక దాడులను మళ్లీ ప్రారంభించేందుకు తన ఉన్నత సహాయకులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని తుఫానుకు ముందు ప్రశాంతత అని వర్ణిస్తూ పరోక్షంగా ఆదేశానికి ఓ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య మళ్లీ యుద్ధం తప్పదన్న సంకేతాలు ఇచ్చేసింది అగ్రరాజ్యం.
ఇరాన్పై భారీ దాడులకు అమెరికా ప్లాన్
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తుఫాను ముందున్న ప్రశాంతత అనే ఏఐ-జనరేటెడ్ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇరాన్పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారనే వార్తలకు ఈ పోస్టు మరింత బలం చేకూరుతోంది.
ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ టోపీ ధరించి, చేయి ఎత్తి చూపుతూ ఓ అమెరికన్ నేవీ అడ్మిరల్తో కలిసి ఉన్నారు. ట్రంప్ వెనుక ఆకాశం నుంచి మెరుపులు, సముద్రంలో నౌవీ షిప్, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు కనిపించాయి. ఇవన్నీ టెహ్రాన్కు ప్రత్యక్ష హెచ్చరికలు పంపుతున్నట్టుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ షేర్ చేసుకున్న ఏఐ పోస్టు, అంతర్జాతీయ మీడియాలో కథనాలు
ఈ పోస్ట్ ద్వారా ఇరాన్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోందని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలపై సహాయకులు అధ్యక్షుడు చర్చిస్తున్నారని అందులోని సారాంశం.
ఫ్రెంచ్ బ్రాడ్కాస్టర్తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. శాంతి ఒప్పందం జరగకపోతే ఇరాన్కు గడ్డుకాలం తప్పదని, ఒప్పందం చేసుకోవడం వారి ప్రయోజనాలకే మంచిదని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఇంకా అమల్లో ఉన్నప్పటికీ, హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించలేదు.
ALSO READ: యూఏఈపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ.. అండగా ఉంటామని వెల్లడి
ట్రంప్ ప్రపంచ నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్న తరుణంలో ఈ చిత్రాన్ని షేర్ చేసుకున్నారు. కొత్త చర్చలకు సుముఖత సూచిస్తూ ట్రంప్ ప్రభుత్వం నుండి తమ ప్రభుత్వానికి సందేశాలు అందాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
చైనా పర్యటనను ముగిస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హోర్ముజ్ జలసంధి ఇంకా అమెరికా నియంత్రణలో ఉందన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా విధించిన నౌకా దిగ్బంధనం వల్ల రెండున్నర వారాలుగా కొనసాగుతోంది. దీనివల్ల ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూస్తోందని నొక్కి వక్కానించారు.