Trump Statement: ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికా మెతక వైఖరి అవలంబిస్తోందా? చర్చల పేరుతో కాలయాపన చేస్తోందా? మళ్లీ 10 రోజులు విరామం ఎందుకు ఇచ్చినట్టు? ఇరాన్ను చూసి నిజంగా ట్రంప్ భయపడ్డారా? లేకుంటే వెనుక ఏమైనా స్కెచ్ ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఇరాన్పై మారుతున్న అమెరికా వైఖరి
ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాయిస్ మారుతోంది. ఆ దేశ కీలక నేతలను హతమార్చామని పదే పదే చెబుతున్నప్పటికీ ఆయన మాటలకు.. పనులకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తాజాగా ఇరాన్పై మరొక శుభవార్త చెప్పారు. తొలుత ఇరాన్పై యుద్ధాన్ని 48 గంటలు డెడ్లైన్ పెట్టారు. ఆ తర్వాత ఐదు రోజులకు పొడిగించారు.
ఈసారి ఏకంగా 10 రోజులకు పెంచేశారు. దీంతో ట్రంప్ వ్యవహారశైలిపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరాన్కు పిలుపు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు.
మరో 10 రోజులు విరామం ఇచ్చిన ట్రంప్
ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌళిక సదుపాయాలపై దాడులను మరో 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతమంతటా పోరాటం కొనసాగుతున్నప్పటికీ దౌత్యానికి ఆస్కారం ఉందని చెప్పకనే చెప్పారు. టెహ్రాన్ అభ్యర్థన మేరకు పొడిగింపు జరిగిందని ఆ దేశంపై నెపాన్ని నెట్టేశారు. ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇరాన్ కేవలం వారం రోజులు మాత్రమే కోరిందని, తాము 10 రోజులు గడువు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు చాలా బాగా సాగుతున్నాయన్నారు. ఇరాన్ నేతలు ఒప్పందం కోసం వేడుకుంటున్నారని, నేను కాదని తేల్చేశారు. చర్చల సమయంలో హోర్మూజ్ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్లు వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వడం మంచి పరిణామంగా వర్ణించారు.
ALSO READ: బోస్ఫరస్ జలసంధి వద్ద టెన్షన్.. ఆయిల్ నౌకపై డ్రోన్ దాడి, ఇంతకీ ఎక్కడ?
అమెరికా వాదనలను మొదటి నుంచి ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. తాము చర్చలు కోరుకోవడం లేదని తేల్చి చెప్పింది. పరోక్ష సంప్రదింపులు మాత్రమే కొనసాగుతున్నాయని ఆదేశ మీడియా చెబుతోంది. కొద్దిరోజులు కిందట ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మూకుమ్మడిగా దాడులు చేశాయి.
ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు చేశాయి. అయితే అమెరికా యూటర్న్ తీసుకుంది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై తన దాడులను కంటిన్యూ చేస్తోంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లోని కీలక నగరాలపై డ్రోన్లు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య జరుగుతునన పరిణామాలను అంతర్జాతీయ నిపుణులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు.