Venezuela: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించిన విషయం తెలిసింది. శనివారం తెల్లవారుజామున అమెరికా వైమానిక దాడి చేసి.. మదురో, అతడి భార్యను బంధించి అమెరికాకు తరలించారు. మదురో యూఎస్ లా ఎన్ ఫోర్స్మెంట్ అదుపులో ఉన్నారని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అమెరికా సైనిక చర్యకు వెనిజులా నుంచి మద్దతు లభిస్తుంది. ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. వెనిజులా జెండాలతో వీధుల్లోకి వచ్చి థ్యాంక్యు ట్రంప్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో వెనిజులా దేశస్థుల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా, మయామి, న్యూయార్క్, స్పెయిన్, అర్జెంటీనాలో ప్రజలు ర్యాలీగా వచ్చి స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మారాలని చాలా కాలంగా తాము ఎదురుచూస్తున్నామని వారు అంటున్నారు.
“త్వరలో మేమంతా మా కుటుంబాలతో ఉంటాము. నా విషయానికొస్తే, నేను ఆరు సంవత్సరాలుగా నా కుమార్తెలను చూడలేదు. మదురో రాజకీయ హింసతో నేను అమెరికాకు పారిపోయి వచ్చాను. నేను త్వరలో వెనిజులాకు తిరిగి వెళ్తాను. నా కుటుంబాన్ని కలుసుకుంటాను”- ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి
I have not seen one Venezuelan mad at Trump for arresting Maduro.
Not one.
— Ada Lluch (@ada_lluch) January 4, 2026
మదురో పదవి నుంచి దిగిపోవాలని చాలా కాలంగా కోరుకుంటున్నామని వెనిజులాకు చెందిన అలెక్సా పెరెజ్ అన్నారు. ‘థ్యాంక్యూ ట్రంప్, ఇది మాకు రెండోసారి స్వేచ్ఛ. ఈ రోజు మాకు స్వాతంత్ర్య దినోత్సవం.మేము చాలా పేదవాళ్లం, మాకు ఆసుపత్రి లేదు, మా ప్రజలకు హక్కులు లేవు” అని పెరెజ్ అన్నారు. వెనిజులాను తాత్కాలికంగా అమెరికా పాలించాలని, చమురు నిల్వలను ఉపయోగించి దేశాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.
వెనిజులాపై అమెరికా మెరుపుదాడి ఆ దేశ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎయిర్ ఫోర్స్ దాడుల్లో విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినడంతో రాజధాని కారకాస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఆహారం కోసం చిన్న ఆహార కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. కారకాస్ విమానాశ్రయంపై కూడా అమెరికా దాడి చేయడం.. విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
Also Read: అమెరికా తలుచుకుంటే ఏ దేశమైన నాశనమేనా? వెనెజుయెలాపై దాడి వెనుక షాకింగ్ నిజాలు
ప్రజా రవాణా నిలిచిపోయింది. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. కరెంటు నిలిచిపోడవంతో ఫోన్ల ఛార్జింగ్కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ స్తంభాల వద్ద కరెంటు ఉండటంతో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసి, కీలక సూచనలు చేస్తుంది.